ప్రాణం తీసిన సరదా: రైలు ట్రాక్పై సైకిల్ తొక్కుతుండగా ఢీకొన్న రైలు, ఇద్దరు యువకుల మృతి
పశ్చిమగోదావరి: ఇద్దరు యువకులు రైల్వే పట్టాలపై సరదాగా సైకిల్ తొక్కుతుండగా వెనుక నుంచి వచ్చిన ఈస్ట్కోస్టు ఎక్స్ప్రెస్ ఢీకొంది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో గురువారం చోటు చేసుకుంది. పత్తేబాద ప్రాంతానికి చెందిన జన్యావుల మోహన్(17) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆవాల మౌళీకుమార్(22) సెంట్రింగ్ పనిచేస్తుంటాడు.
స్నేహతులైన వీరిద్దరు గురువారం రెండు సైకిళ్లపై కొత్త బస్టాండ్ సెంటరు సమీపంలోని రైల్వే పట్టాలపై సైకిళ్లు తొక్కుతున్నారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన రైలు ఢీకొనడంతో మృత్యువాత పడ్డారు.
దంపతుల ఆత్మహత్యాయత్నం: భార్య మృతి
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో గురువారం దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగగా.. కుటుంబసభ్యులు హుటాహుటిన బనగానపల్లెలో ఓ ఆసుపత్రికి తరలించారు.
చికిత్సపొందుతూ భార్య వెంకటలక్ష్మి(50) మృతిచెందగా, భర్త రామచంద్రారెడ్డి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబకలహాలతోనే ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.