కోపం వస్తే ఉదయ్ కిరణ్ గాయపరుచుకునేవాడు
హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన తెలుగు సినీ హీరో ఉదయ్ కిరణ్ కోపం వస్తే తనను గాయపరుచుకునేవాడని పోలీసులు అంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులను విచారించిన తర్వాత పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆర్థమవుతోంది. ఉదయ్ కిరణ్ ఆదివారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఆర్థిక కారణాలు, నమ్మినవారు మోసం చేయడంతో మానసికంగా నలిగిపోయి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు డిసిపి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఉదయ్ భార్య, మామ, స్నేహితులు రోహిత్, శరత్లను మూడు గంటలపాటు విచారించినట్లు ఆయన తెలిపారు. కోపం వస్తే తనను తాను గాయపర్చుకునేవారని, అందుకు ఎడమచేయి, తొడమీద ఉన్నగుర్తులే నిదర్శనమని ఆయన అన్నారు.

నమ్మిన స్నేహితులే ఉదయ్ కిరణ్కు మొహం చాటేశారని ఆయన తెలిపారు. ఉదయ్ కిరణ్ కొత్త సినిమా కోసం పది రూపాయల వడ్డీతో రూ.15 లక్షలు తీసుకున్నారని, అప్పు చెల్లించమని బాకీ వాళ్లు ఒత్తిడి చేశారని, ఒత్తిడిని తట్టుకోలేక ఉదయ్కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని సత్యనారాయణ తెలియజేశారు.
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఆయన ఆత్మహత్యపై సినీ పరిశ్రమ ప్రముఖులు స్పందించారు. సినీ పరిశ్రమలో విషాద వాతావరణం కూడా చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications