క్రెడిట్ జగన్కు పోతుందనే బాబు పోరాటం: ఫోజులెందుకని ఉండవల్లి ఆగ్రహం
తూర్పుగోదావరి: ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమయంలో లోక్సభలో జరిగిన ప్రహసనంపై వచ్చే శీతాకాల సమావేశంలో నోటీసులు ఇవ్వాలని, విభజనపై తాను సుప్రీంలో వేసిన పిటిషన్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు ఆయన రాసిన లేఖను శుక్రవారం ఆయన విడుదల చేశారు.
టీడీపీలో గూండాలు-తరిమి కొడతారు: ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన 'అమిత్ షా'పై దాడి
ఈ సందర్బంగా రాజమహేంద్రవరంలో ఉండవల్లి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అవసరం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రత్యేక హోదా పోరాటం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.
క్రెడిట్ జగన్కు పోతుందునే బాబు ఆరాటం
ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికే మొత్తం క్రెడిట్ పోతుందనే చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ హడావుడి చేస్తున్నారని ఉండవల్లి మండిపడ్డారు. ‘నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాతో ఏం వస్తుందన్నారు. హోదా ఏమైనా సంజీవనా? అని ప్రశ్నించారు. హోదా ముగిసిన అధ్యాయమన్నారు' అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఇప్పుడిలా..
ఎన్నికలకు ఏడాది ఉందనగా ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది తానేనంటూ 11 ఛానళ్ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబుపై ఉండవల్లి ధ్వజమెత్తారు. ‘అంతేగాక, 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామంటున్నారు. బీజేపీ అప్పుడు కూడా కేంద్రంలో అధికారంలోనో, లేక ప్రతిపక్షంలోనో ఉంటుంది. మీపై కక్షతో ఇప్పుడు అడ్డుకుంటే రేపు కూడా అడ్డుకోదా?' అని ఉండవల్లి ప్రశ్నించారు.
చంద్రబాబు ఫోజులు చూస్తే..
‘రాష్ట్రం వెలిగిపోతోంది. 2029 ముందే ప్రపంచంలోనే నంబర్ వన్ రాష్ట్రం అవుతుంది. గుజరాత్ కన్నా మనం ముందుకు పోతాం కాబట్టే అణిచివేస్తున్నారు. జీడీపీలో దేశం కన్నా మనమే టాప్ అంటూ ఫోజులు కొడుతుంటే.. అంతా బాగున్నవారికి హోదా ఎందుకు? అని ఎవరైనా అనుకుంటారు' అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
అలా ఐనా దేశం మొత్తం తెలుస్తుంది..
‘దేబిరించాల్సిన సమయంలో కాలుమీద కాలేసుకుని ఫోజులు కొడితే ఎలా?' అని ఉండవల్లి సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. విభజనకు సంబంధించి లోక్సభ శీతాకాల సమావేశాల్లో నోటీసులిస్తే.. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి మీరంటే మీరే కారణమంటూ బీజేపీ, కాంగ్రెస్ దుమ్మెత్తి పోసుకుంటాయని, ఇలా అయినా రాష్ట్రానికి జరిగిన అన్యాయం దేశం మొత్తం తెలుస్తుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
భర్త సెల్వమణితో కలిసి కొత్త ఇంట్లో అడుగుపెట్టిన రోజా(పిక్చర్స్)