రేప్, మర్డర్ జరిగినా: ఉండవల్లి సంచలనం, టిలోను పోటీ
విజయవాడ: జై సమైక్యాంధ్ర పార్టీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పక్షం, ప్రతిపక్షం కలిసిపోతే పార్లమెంటులో రేప్, మర్డర్ జరిగినా ఆ విషయం బయటకు రాదన్నారు. ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో సీమాంధ్ర ప్రాంత ఎంపీలపై దాడి జరగడమే... పార్లమెంటులో ఏం జరిగినా బయటకు రాదనేందుకు మంచి నిదర్శనమన్నారు. పార్లమెంటులో టిడిపి ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని గొంతు నులిమి చంపేసేవారే అన్నారు. లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేయడంతో మోదుగులకు ఏం కాలేదన్నారు.
సమైక్యాంధ్ర కోసం తమ రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విభజన ఆపేందుకు కిరణ్, తాము ఎంతో ప్రయత్నాలు చేశామన్నారు. మోదుగుల పైన మూకుమ్మడి దాడి చేయడం వల్లనే లగడపాటి పెప్పర్ స్ప్రే ఉపయోగించారన్నారు.
ఇప్పటికీ విభజన జరగదని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు. ప్రజలు తమకు మద్దతు ఇస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. తెలంగాణలోను తమ జై సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేస్తుందన్నారు. విభజన ఇంకా జరగలేదని, దానిని ప్రజలు గుర్తించాలన్నారు.
2005లో రాజ్యసభ మహిళా బిల్లుకు ఆమోదం తెలిపిందని, ఇప్పటి వరకు దానిని లోకసభలో ఎందుకు పెట్టలేదన్నారు. తెలంగాణవాదులు భద్రాచలాన్ని ఎలా అడుగుతారో చెప్పాలన్నారు. భద్రాచలాన్ని నిజాం ప్రభువులు పాలించారా అని ప్రస్నించారు. తెలంగాణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని బిజెపి నేత అరుణ్ జైట్లీయే చెప్పారన్నారు. కాగా, సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడి దృశ్యాలను ఉండవల్లి చూపించారు.