చంద్రబాబును వెంటాడుతోన్న జగన్, కేసు ఎఫెక్ట్ తో పర్యటనలన్నీ రద్దు!!
విజయవాడ : ఓటుకు నోటు కేసు తర్వాత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చాలానే మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడకే పరిమితమైపోయి, తెలంగాణ పాలిటిక్స్ ను అంతగా పట్టించుకోని పరిస్థితి. ఇద్దరి మధ్య రాజీ కుదిరిందో.. లేక అనవసరంగా కేసీఆర్ తో పెట్టుకుని ఇరకాటంలో పడడమెందుకని చంద్రబాబే భావించారో తెలియదు గానీ మొత్తానికి కేసీఆర్ చంద్రబాబుకు మధ్య మునుపటి తరహాలో పేచీలు లేవు.
అప్పటిదాకా ఒకరిపై ఒకరు అంతెత్తున విమర్శలు చేసుకున్న నేతలిద్దరు.. ఓటు నోటు కేసు తర్వాత సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు కూడా తెలంగాణ పాలిటిక్స్ కు దూరంగానే ఉంటూ వస్తున్నారు కాబట్టి.. కేసీఆర్ కూడా ఓటుకు నోటు కేసును అంతగా పట్టించుకోవట్లేదనే చెప్పాలి. అయితే ఓటుకు నోటు కేసు విషయంలో కేసీఆర్ కు పట్టింపు లేకపోయినా.. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం చంద్రబాబును ఎలాగైనా ఇరుకున పెట్టాలనే పంతంతో ఉన్నట్లుగానే కనిపిస్తోంది.
అందుకే.. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని జగన్ మళ్లీ తెరపైకి తీసుకొచ్చేలా చేశారు. తన పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డికి ఆ వ్యవహారాన్ని అప్పగించి ఆర్టీఐ సహకారంతో కేసుకు సంబంధించిన అన్ని రిపోర్టులను సేకరించారు. ఆ నివేదికలన్నీ అందులో ఉన్న గొంతు చంద్రబాబుదే అని తేల్చడంతో, వాటి ఆధారంగా చేసుకునే ఇప్పుడు రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై పిటిషన్ దాఖలు చేశారు.
ఓటుకు నోటు కేసులో జరగాల్సినంత విచారణ జరగలేదన్న పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తూ.. వచ్చే నెల 29వ తేదీలోగా దీనిపై పునర్విచారణ పూర్తి చేయాల్సిందిగా ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇక ఇక్కడినుంచే కేసు వ్యవహారమంతా మరింత రక్తి కట్టేలా కనిపిస్తోంది. గతంలో లాగే ఈసారి కూడా చంద్రబాబు తన అస్త్రాలన్నింటినీ ఉపయోగించి కేసును ముందుకు కదలకుండా చేస్తారా..! లేక కేసును మళ్లీ నిద్రలేపిన జగన్ చంద్రబాబును మరింత ఇరుకున పెడుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

అప్పుడే మొదలైన ఎఫెక్ట్ :
ఓటుకు నోటు కేసు విషయంలో పునర్విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. తన పర్యటనను పక్కనబెట్టేసి న్యాయ నిపుణలతో సమావేశమయ్యే పనిలో పడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. రెండు రోజుల పాటు తిరుపతిలో జరగాల్సిన పర్యటను అర్థాంతరంగా రద్దు చేసుకుని తంబళ్లపల్లి నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు.
తిరుపతిలో కేంద్రమంత్రి జేపీ నడ్డా పాల్గొనబోతున్న కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకావాల్సి ఉంది. కానీ కోర్టు ఆదేశాల నేపథ్యంలో, ఆయన ఉన్న పలంగా బెంగుళూరు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి తాత్కాలిక నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు.. అక్కడే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపే పనిలో పడ్డట్లుగా సమాచారం. అనూహ్యంగా మళ్లీ తెరపైకి వచ్చిన ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు అనంతపురం
పర్యటన కూడా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications