గోదావరి నదిలో పడిన తుఫాన్ వాహనం: 22 మంది దుర్మరణం
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ధవళేశ్వరం బ్యారేజీ వద్ద తుఫాన్ వాహనం గోదావరి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది మరణించారు. వాహనం ధవళేశ్వరం బ్యారేజీపై డివైడర్ను ఢీకొట్టి గోదావరి నదిలోకి బోల్తా కొట్టింది.
మృతులు విశాఖ జిల్లా అచ్చుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన ఈగల రాంబాబు కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు విజయవాడ దుర్గమ్మను దర్శించుకొని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైనప్పుడు వాహనంలో 23 మంది ఉన్నారు. అంతకు ముందు వారు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో దుర్గమ్మ గుడికి వెళ్లారు.
వారిలో ఆరుగురు చిన్నారులు, ఆరుగురు పురుషులు, తొమ్మిది మంది మహిళలు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులను 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఓ బాలిక మరణించింది.
గాయపడిన ఈగల కిరణ్ (13) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల్లో వాహనం డ్రైవర్ అప్పారావుతో పాటు రాంబాబు, కొండతల్లి, ప్రసాద్, కనక, కోసమ్మ, గోపీ, సాయి, పూర్ణ, రాజు, రమణ, వెంకట్, శీనమ్మ, నమిత్, కార్తిక్, నవ్య, పవన్, సంధ్య ఉన్నారు. వాహనం 30 అడుగుల లోతులోకి పడడం, ప్రమాదం అర్థరాత్రి జరగడం వంటి కారణాల వల్ల తీవ్రత ఎక్కువగా ఉంది. వాహనం పిట్టగోడును ఢీకోని గోదావరి నదిలో పడినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ హరికృష్ణ చెప్పారు.
డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. మృతుల బంధువులకు సమాచారం అందించామని, బంధువులు వచ్చిన తర్వాత శవపరీక్ష చేసి మృతదేహాలను అప్పగిస్తామని హరికృష్ణ చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెప్పారు.