రహస్య అజెండా ఏమిటి?: కేసీఆర్పై వేం, కే4 పాలన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తెలంగాణ ప్రాంత బీజేపీ, టీడీపీ నేతలు శనివారం నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి పీఆర్వో చేసిన వ్యాఖ్యలను బట్టి సర్వేపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వం ఈ సర్వే వెనుక ఉన్న రహస్య ఎజెండా బయట పెట్టాలని టీ టీడీపీ నేత వేం నరేందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ తన రెండున్నర నెలల పాలనలో వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఈ సర్వే పేరుతో సంచలనం సృష్టించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
సర్వేలో ప్రజలు సమాచారం ఇవ్వడం బలవంతం కాదని, వారి ఇష్టమేనని ప్రభుత్వం కోర్టులో చెప్పిందని, కానీ అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రకరకాల మాటలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో 85 లక్షల కుటుంబాలు ఉంటే కోటి పదిహేను లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వం పదేపదే ప్రచారం చేస్తూ భారీ ఎత్తున కార్డులు తొలగించాలని ప్రయత్నిస్తోందని, దీనిపై కోర్టులు, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.
గ్యాస్, సైకిల్ వంటి వాటి సమాచారం ఎందుకని ప్రశ్నించారు. ఈ సమాచారాన్ని అడ్డుపెట్టుకొని ఆ పేరుతో కార్డులు తొలగించాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఆంధ్రా బూచి చూపించి తెలంగాణలో పేదల పొట్ట కొడుతున్నారని, సర్వే పేరుతో సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెడతారేమోనని ప్రజలు భయపడాల్సి వస్తోందన్నారు. జనాభా లెక్కలు తీయడానికి ప్రభుత్వం ఏళ్ల తరబడి సమయం తీసుకొంటుంటే ఒక్క రోజులో తెలంగాణ మొత్తం సమగ్ర సర్వే ఎలా సాధ్యమవుతుందన్నారు.
మహబూబ్నగర్ నుంచి పొట్ట చేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లిన 12, 13 లక్షల మంది ఒక్క రోజు సర్వేలో నమోదు చేసుకోవడం ఎలా సాధ్యమన్నారు. కరీంనగర్ తదితర జిల్లాల నుంచి లక్షల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారని, వారి సమాచారం ఎలా సేకరిస్తారన్నారు. గతంలో వైయస్ ప్రభుత్వం కూడా సర్వేల పేరుతో పాతిక లక్షల కార్డులు తొలగించిందని, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అదే దారిలో నడుస్తోందన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే తెలంగాణ వ్యతిరేకులని ముద్ర వేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము గతంలో వైయస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడామని, ఇప్పుడు ఈ ప్రభుత్వం తప్పులు చేసినా పోరాడుతామని, సంక్షేమ పథకాలను నీరుగార్చి పేదలకు నష్టం చేయాలనుకొంటే సహించేది లేదన్నారు.
పేద వర్గాలైన బీసీ, ఈబీసీలను 1956కు ముందు ఎక్కడ పుట్టారని అడగడం దుర్మార్గమని, అలా అంటే తెలంగాణకు సీఎంగా 120 ఏళ్ల క్రితమే పుట్టిన వాళ్లు కావాలని అడుగుతున్నామని, కేసీఆర్ బీహార్లో పుట్టి, విజయనగరంలో పెరిగి వచ్చారని ఆయన మేనమామ పీసీసీ మాజీ అధ్యక్షులు ఎం సత్యనారాయణ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నానని టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కూలీనాలీ చేసుకునే నిరుపేద కుటుంబాలు తమ పిల్లల జనన తేదీని రికార్డుల్లో నమోదు చేయించుకోలేదని, చాలామందికి పుట్టిన తేదీయే తెలియదని, ఇలాంటి దుర్మార్గుడు వస్తాడని తల్లిదండ్రులకు తెలియదన్నారు. విద్యారంగంపై కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో రేవంత్ ప్రసంగించారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ ఆరునెలలు ఆలస్యమైతే ఏమవుతుందని కేసీఆర్ అంటున్నారని, రాష్ట్రం ఏర్పడి ఆరు గంటలు గడవకముందే ప్రమాణ స్వీకారం చేసి కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చుకోలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కూతురు కవిత పార్లమెంటుకు వెళ్లి పెరుగన్నం తింటుంటే, ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో అవమానానికి గురైన ఉప్పుగూడకు చెందిన పేద విద్యార్థిని పురుగుమందు తాగాలా? అన్నారు.
బడుగు బలహీనవర్గాల వారు చదువుకుని రాజ్యాధికారంలో హక్కు అడుగుతారనే అక్కసుతో దొరల రాజాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం నాడు విద్యార్థులను ఉద్యమబాట పట్టించిన ప్రొఫెసర్ కోదండరాం, నేడు విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ముందుకు రావాలని కోరారు. నాడు విద్యార్థులను వీరులని మొక్కిన మంత్రి హరీశ్ రావు నేడు తంతున్నాడని విమర్శించారు.
నార్సింగి, నందినీ హిల్స్లోని ఇద్దరు దొరల గడీల్లో గంటల కొద్దీ గడిపే కేసీఆర్.. ఓయూలో ఉద్యమం చేస్తున్న విద్యార్థులతో ఐదు నిమిషాలు మాట్లాడడానికి సమయం కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో 4జీ సేవలేమో కానీ, ఆయన కే4 (కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీశ్ రావు) పాలన చేస్తున్నారని రమణ ఆరోపించారు.