వెంకయ్య వీడ్కోల వేళ- ఖర్గే వ్యాఖ్యలతో ఒక్కసారిగా : ఆయనే అవకాశం ఇచ్చారు - సాయిరెడ్డి..!!
ఉపరాష్ట్రపతి వెంకయ్యా నాయుడు పదవీ కాలం ఈ నెల10వ తేదీతో ముగియనుంది. నూతన ఉప రాష్ట్రపతిగా ధన్ ఖడ్ ఎన్నికల్లో విజయం సాధించటంతో ఆయన 11వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతిగా - రాజ్యసభ చైర్మన్ గా అయిదేళ్ల పదవీ కాలం పూర్తి కావటంతో..పెద్దల సభలో వెంకయ్యకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ..వెంకయ్యతో కలిసి పని చేసే అవకాశం తనకు కలిగిందన్నారు. వెంకయ్య అనేక కష్టాలను అధిగమించారని ప్రశంసించారు.పార్టీ కార్యకర్తగా ప్రారంభమై..పార్టీ అధ్యక్షుడిగా ఎదిగిన విధానం స్పూర్తి దాయకమన్నారు

ప్రధాని ప్రశంసలు - ఖర్గే ప్రసంగంలో
నేటి తరానికి స్పూర్తిగా నిలుస్తారన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరిస్తున్న మల్లిఖార్జున ఖర్గే తనకు వెంకయ్య నాయుడుతో నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. కర్ణాటక నుంచి వెంకయ్య రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయ పార్టీలుగా సిద్దాంత పరంగా విభేదాలు ఉన్నా.. పరస్పర గౌరవ భావం ఉండేదని చెప్పుకొచ్చారు. అనేక చర్చలకు సంబంధించిన అంశాల్లో ఛైర్మన్ హోదాలో వెంకయ్య వ్యవహరించిన తీరును ఖర్గే ప్రశంసించారు. అయితే, ఇదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. కొన్ని కీలక బిల్లులు..కష్ట సమయంలో వెంకయ్య పైన ఒత్తిడి పని చేసిందని ఆక్షేపించారు.

ఒత్తిళ్లు పని చేసాయంటూ వ్యాఖ్య
ఛైర్మన్ హోదాలో ఉండే వ్యక్తి పైన ఉండే ఒత్తిళ్లను తాము అర్దం చేసుకోగలమని చెప్పారు. ఆయన పని తీరు పైన తమకు కొన్ని ఫిర్యాదులు ఉన్నాయని..అయితే, ఇది సమయం కాదని ఖర్గే వ్యాఖ్యానించారు. చివరకు వెంకయ్య సేవలను ప్రశంసిస్తూ..ఆయన భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షించారు, దీనికి వెంకయ్య సైతం సమాధానం చెప్పారు. తాను నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నానని.. ఎక్కడా తన మీద ఒత్తిడి లేదని చెప్పారు. ఇక, వైసీపీ నేత విజయ సాయిరెడ్డి వెంకయ్య నాయుడు తెలుగు జాతికే గర్వకారణమని ప్రశంసించారు. వెంకయ్య- తాను ఇద్దరం నెల్లూరు నుంచే వచ్చామని చెప్పారు. తన చిన్న వయసులోనే వెంకయ్య సభలు చూసేవాడినని చెప్పుకొచ్చారు.

తెలుగు జాతికి గర్వకారణం - సాయిరెడ్డి
పలు భాషల్లో వెంకయ్య ప్రావీణ్యాన్ని అభినందించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఈ స్థాయికి ఎదిగారని చెప్పుకొచ్చారు. తాను ఆరేళ్ల క్రితం సభలో ప్రవేశించిన సమయంలో చివరి వరుసలో ఉండేవాడినని..తనకు అసలు మాట్లేండేందుకు అవకాశం వస్తుందా అని ఆలోచించేవాడినని చెప్పుకొచ్చారు. కానీ, తనకు వెంకయ్య ఛైర్మన్ అయిన తరువాత మాట్లాడే అవకాశం పలు సందర్భాల్లో కలిగిందన్నారు. అదే విధంగా తనకు ప్యానల్ ఛైర్మన్ గా అవకాశం కల్పించింది వెంకయ్య నాయుడేనని.. ఆయన కారణంగానే ఆ ఛాన్స్ దక్కిందంటూ సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. వెంకయ్య కు సాయిరెడ్డి అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications