విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్కు డబ్బులే ముఖ్యమా? విలువలు కాదా?
విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్.. ఇద్దరూ గొప్ప నటులే. అందులో సందేహం లేదు. వారి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెరపై వారిద్దరూ గొప్ప పాత్రలు పోషించారు. విలన్ పాత్రలు పోషించారు. అన్నిరకాల పాత్రలు పోషిస్తున్నారు. కానీ అది తెరపైకి మాత్రమే. తెర వెనక వీరిద్దరికీ డబ్బే ప్రధానమంటూ ఫిల్మ్నగర్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సినిమా ప్రమోషన్లకు రారని, అలా రావాలంటే వీరికి ప్రత్యేకంగా రెమ్యునరేషన్ సమర్పించుకోవాల్సి ఉంటుందని, అందుకే నిర్మాతలు వారిద్దరినీ ప్రమోషన్లకు పిలవడంలేదని చెబుతున్నారు.
కమల్హాసన్కు కూడా హ్యాండిచ్చారు?
కమల్హాసన్ లాంటి భారతదేశం గర్వించదగ్గ నటుడితో కలిసి వారిద్దరూ విక్రమ్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హౌదరాబాద్లో జరిగింది. వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ మాత్రం కనపడలేదు. గతంలో ఉప్పెన సినిమాలో నటించిన సమయంలోను పారితోషికం భారీగా తీసుకున్న విజయ్ సేతుపతి ప్రమోషన్లలో మాత్రం పాల్గొనలేదు. ప్రత్యేకంగా రెమ్యునరేషన్ అడగడంతో సినిమా నిర్మించిన మైత్రీ మూవీస్ నిరాకరించింది.
వీరిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు
అలాగే ఫహద్ ఫాజిల్ పుష్ప సినిమాలో నటించారు. ఆ సినిమా ప్రమోషన్ ఈవెంట్లోను కనిపించలేదు. ఇతర సినిమాలకు ఎలా వ్యవహరించినప్పటికీ కమల్హాసన్ సినిమాకు కూడా వీరిద్దరూ ఇలా వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అన్నిటికంటే చిత్రం ఏమిటంటే వీరిద్దరికీ కమల్ అంటే గౌరవం ఉంది. కమల్హాసన్ సినిమాలు చూస్తూ పెరిగామన్నారు. తాము నటులు కావడానికి కమల్హాసనే కారణం అన్నారు. కానీ డబ్బుల దగ్గరకు వచ్చేసరికి కమల్హాసనైనా, ఏ హాసనైనా ఒకటేనని, తమ నిబంధనల ప్రకారం ప్రమోషన్లలో పాల్గొన్నందుకు డబ్బులివ్వాల్సిందేనని చెప్పేసరికి నిర్మాతలు తగ్గారు.
మనిషి కొన్ని సందర్భాల్లో పట్టువిడుపులు ప్రదర్శించాలి
కొన్నిసార్లు ప్రతి మనిషి పట్టు విడుపులు ప్రదర్శించాలనే సూత్రాన్ని మన పెద్దలు చెబుతారు. కానీ ప్రతిసారీ విడుపు కాకుండా పట్టే ఉండాలంటే ఎక్కడో ఒకచోట ఎదురుదెబ్బలు తగలడం ఖాయమని అనేక అనుభవాలు ఎందరి విషయంలోనే స్పష్టం చేశాయి. డబ్బును విలువలతో వెలకట్టలేం. ఆ విలువలతోనే జీవించినవారు అనేకమంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కానీ ఇక్కడ డబ్బే లోకమంటున్న విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటివారు తెరపై రాణించవచ్చేమోకానీ తెరవెనక ఎప్పటికీ రాణించలేరనే అభిప్రాయాన్ని సినీ ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ విడుదల చేయబోతున్నారు.