రెండు సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేల పోటీ ? సాయిరెడ్డి క్లారిటీ ! మీ సంగతేంటి బాబూ, పవన్..!
ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఈసారి ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ మొదలైంది.చాలా వరకూ నియోజకవర్గాల్లో అధికార ఎమ్మెల్యేలు సిట్టింగ్ స్ధానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే పలు చోట్ల ఎమ్మెల్యేలు ఎంపీలుగానూ, ఎంపీలు కాస్తా ఎమ్మెల్యేలుగానూ పోటీ చేసే అవకాశముంది. మరికొందరు ఈసారి పోటీకి దూరంగా కూడా ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ కీలక ప్రకటన చేశారు.
ఏపీలో ఈసారి వైసీపీ ఎమ్మెల్యేలు రెండు సీట్లలో పోటీ చేసే అంశంపై ఎంపీ సాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ లో క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి రెండు సీట్లలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పోటీ చేసే అవకాశం లేదని తేల్చిచెప్పేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు కేవలం సిట్టింగ్ స్ధానం లేదా మారే స్ధానం నుంచి మాత్రమే పోటీ చేసే అవకాశమున్నట్లు స్పష్టం చేశారు.

అంతటితో ఆగకుండా విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఎంపీ సాయిరెడ్డి టార్గెట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఒక్క సీటు నుంచి మాత్రమే పోటీ చేస్తారని చెప్పిన సాయిరెడ్డి.. విపక్ష నేతలు ఎన్ని స్ధానాల నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గతంలోలా రెండు సీట్ల నుంచి పోటీ చేస్తారా లేదా అన్న దానిపై సాయిరెడ్డి క్లారిటీ కోరారు. అలాగే చంద్రబాబు కూడా మరో స్ధానం నుంచి పోటీ చేయొచ్చన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో సాయిరెడ్డి ఆయన్నూ ప్రశ్నించారు.
ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పలేని దయనీయ స్ధితిలో ప్రతిపక్ష నేతలు ఉన్నారని, సురక్షిత సీట్ల కోసం ఇంకా వెతుకులాట సాగుతోందని సాయిరెడ్డి ఓ ట్వీట్ లో తెలిపారు. రెండు చోట్ల కాకుండా ఒక్క సీట్లో మాత్రమే బరిలోకి దిగుతామని చెప్పే ధైర్యం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెబుతున్నా, మా పార్టీ నుంచి ఎవరూ రెండు సీట్లలో పోటీ చేయరంటూ సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.












Click it and Unblock the Notifications