ఏపీ రాజధానుల పోరు- కొత్త రణరంగంగా విశాఖ-అక్కడ నెగ్గితే చాలనే భావన-కర్నూలూ వెనక్కి?
ఏపీలో రాజధానుల పోరు ముదిరింది. మూడు రాజధానులకు తెరపైకి తెచ్చిన వైసీపీ, అమరావతికే అండగా నిలుస్తున్న విపక్ష పార్టీల మధ్య పోరుతో ఇప్పటివరకూ సైలెంట్ గా సాగిపోతున్న వార్ కాస్తా విశాఖలో తాజా పరిణామాలతో మరో మలుపు తిరిగినట్లయింది. దీంతో ఇప్పుడు రాజధానుల పోరు అమరావతి నుంచి విశాఖకు చేరినట్లయింది. ఈ నేపథ్యంలో విశాఖలో తాడోపేడో తేల్చుకునేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.

ఏపీ రాజధానుల పోరు
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు ముదురుతోంది. ఇప్పటికే అమరావతి రైతులు అరసవిల్లివైపు పాదయాత్రగా కదులుతుంటే దీనికి కౌంటర్ గా విశాఖ గర్జన నిర్వహించి వైసీపీ సత్తా చాటింది. అంతేకాదు ఈ గర్జనలో వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో విపక్షాలు మండిపడుతున్నాయి. దీని ప్రభావం మంత్రులు విశాఖ ఎయిర్ పోర్టుకు తిరిగి వెళ్తున్న సమయంలో కనిపించింది. జనసేన నేతలు మంత్రుల కాన్వాయ్ పై దాడికి దిగడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. అనంతరం పోలీసులు జనసేన నేతల్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం, దీనికి నిరసనగా వారిని వదిలిపెట్టేవరకూ వైజాగ్ లోనే ఉంటానని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో పరిస్దితి మరింత వేడెక్కింది.

వైజాగ్ కు మారిన వేదిక
ఇప్పటివరకూ రాజధానిగా ఉన్న అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని వైసీపీ తెరపైకి తీసుకురావడంతో అమరావతిలో రైతులు పోరు కొనసాగించారు. కానీ ఇప్పుడు అమరావతి రైతులు విశాఖ మీదుగా అరసవిల్లికి యాత్ర చేపట్టడం, దీనికి వ్యతిరేకంగా విశాఖలో వైసీపీ గర్జన పెట్టడంతో రాజధానుల పోరు కాస్తా వైజాగ్ కు మారిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడే పాగా వేయడంతో జనసేన అభిమానులు చుట్టుపక్కల జిల్లాల నుంచి అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో అందరి ఫోకస్ ఇప్పుడు విశాఖపైనే ఉంది. అంతే కాదు విశాఖలో రాజధానిపై అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి మద్దతు ఎవరికి ఉండబోతోందో తెసుకునేందుకు పార్టీలు పోటీపడుతున్నాయి. దీంతో సహజంగానే వైజాగ్ రాజధాని కాకముందే రాజధాని పోరుకు వేదికగా మారిపోతోంది.

బలప్రదర్శనలతో టెన్షన్
ఇప్పుడు రాజధానుల పోరుతో వైజాగ్ లో తమ బలం నిరూపించుకోవాల్సిన పరిస్దితి అన్ని పార్టీలకు ఎదురవుతోంది. దీంతో వైసీపీ విశాఖ గర్జన పేరుతో ఓ బల ప్రదర్శన నిర్వహిస్తే.. పవన్ కళ్యాణ్ జనవాణి పేరుతో బల ప్రదర్శన చేపట్టారు. దీనికి ఆయన అభిమానుల నుంచి భారీ మద్దతు లభించింది. అయితే పోలీసులు దీన్ని అడ్డుకున్నారు. త్వరలో అమరావతి రైతులు కూడా పాదయాత్రతో విశాఖకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి పరిస్ధితులు తలెత్తుతాయో తెలియడం లేదు. రాజధానుల రేసులో తాము ముందున్నామని, తమకే జనం మద్దతుందని చెప్పుకునేందుకు పార్టీలు పడుతున్న పాట్లతో వైజాగ్ లో టెన్షన్ పెరుగుతోంది.

కర్నూలు కూడా వెనక్కి ?
విశాఖలో కార్యనిర్వాహక రాజధాని కోసం వైసీపీ సాగిస్తున్న మూడు రాజధానుల పోరులో సీఎం జగన్ సొంత ప్రాంతం రాయలసీమలోనూ అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమకు సుదూరంలో ఉన్న విశాఖలో అసలైన రాజధాని పెట్టి తమకు హైకోర్టు ఇచ్చి కంటితుడుపు కోసం ప్రయత్నిస్తున్నారన్న భావన పెరుగుతోంది. అదే సమయంలో విశాఖ గర్జనకు తమ పార్టీకి చెందిన రాయలసీమ నేతల్ని కూడా తెప్పించిన వైసీపీ వారి మద్దతు కూడా ఉందని చెప్పే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కర్నూలు న్యాయ రాజధానిని లాయర్లు తప్ప ఎవరూ పట్టించుకునే పరిస్ధితి కనిపించడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో విశాఖ వర్సెస్ అమరావతి ప్లస్ కర్నూలుగా మారకుండా చూసుకోవాల్సిన సవాల్ వైసీపీ ముందు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications