వోల్వో ప్రమాదం: బంధువుల ఆవేదన, బొత్స ఆగ్రహం!

ఇటీవల మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. బాధితులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. దీంతో, బాధిత కుటుంబాల సభ్యులు శనివారం ఉదయం రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి వచ్చారు. తాము మంత్రితో అపాయింట్మెంట్ తీసుకొనే వచ్చామని బాధితులు చెప్పినా లోపలికి అనుమతించేందుకు పోలీసులు ససేమిరా అన్నారు.
దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా బాధ్యులను ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదని.. పరిహారం చెల్లింపులోనూ జాప్యం చేస్తున్నారని, ఇందుకు బాధ్యత వహించి బొత్స రాజీనామా చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. మంత్రుల క్వార్టర్స్లోని బొత్స ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో, పోలీసులు దురుసుగా వారిని అలరించారు. బాధితులను అదుపులోకి తీసుకుని గోల్కొండ స్టేషన్కు తరలించారు.
తాము ఏ తప్పు చేశామని ఇక్కడికి తీసుకొచ్చారో చెప్పేదాకా దిగేది లేదని బాధితులు బీష్మించడంతో పోలీసులు ఆ వ్యానును ఎండలో పార్కింగ్ చేశారు. దీంతో, ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి అప్పటికే మంత్రికి చేరడంతో చర్చలకు పిలిపించారు. బొత్స ఇంటికి వెళ్లిన బాధితులపైనే అతను ఆగ్రహం వ్యక్తం చేశారట.
కాగా, పాలెం బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు బీమా ఇప్పించే బాధ్యత సంబంధిత బస్సు యజమానిదేనని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున కుటుంబానికి లక్ష చొప్పున ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని, సంబంధిత ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిందని వెల్లడించారు. తన నివాసంలోనే శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీమా చెల్లింపులు కర్ణాటకలోనే జరిగాయని, ఆంధ్రప్రదేశ్లో తిరిగేందుకు ఎంట్రీ టాక్స్ల చెల్లింపులు జరిగాయని చెప్పారు.












Click it and Unblock the Notifications