జగన్ ముగినింది అక్కడే -టీడీపీ కూటమి, వైసీపీ ఓట్ల లెక్కలివే..!!
ఏపీలో ఎన్నికల ఫలితం వైసీపీకి భారీ షాక్ ఇచ్చింది. టీడీపీ కూటమికి అనూహ్య విజయం అందింది. కూటమి నేతలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఖుషీగా ఉన్నారు. ఈ నెల 9న ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు సిద్దం అవుతున్నారు. అటు జగన్ తన పదవికి రాజీనామా చేసారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. అయితే, తాను నమ్ముకున్న ఓట్ బ్యాంక్ మద్దతుగా నిలవక పోవటం పైన ఉద్వేగానికి లోనయ్యారు. ఇంతకీ జగన్ ఓట్ బ్యాంక్ ఏమైంది. ఎవరికి ఎవరి మద్దతు దక్కింది...
ఎవరికి ఎన్ని ఓట్లు
ఏపీలో ఈ సారి రెండు శాతం పోలింగ్ పెరిగింది. ఈ ఓట్లు ఎవరికి అనుకూలమనే చర్చ జరిగింది. అధికారంలోకి వస్తామని టీడీపీ కూటమి, జగన్ ధీమాగా కనిపించారు. అంతిమ ఫలితం టీడీపీ కూటమికి అనుకూలంగా వచ్చింది. కానీ, జగన్ ఓడినా..వచ్చిన సీట్లు మాత్రం ఆ పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. ఇక..ఓట్ల పరంగా చూసుకుంటే రాష్ట్రంలో 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా..3.38 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో45.63 శాతం ఓట్లతో 1,53,56,470 మంది టీడీపీకి మద్దతుగా నిలిచారు. వైసీపీకి 39.37 శాతం ఓట్లతో 1,32,57,919 మంది ఓట్లు వేసారు.

అధిక మెజార్టీ
జనసేనకు సుమారు 8.3 శాతం ఓట్లతో 20 లక్షల మంది మద్దతు తెలుపగా..బీజేపీకి 9.53 లక్షల మంది (2.80 శాతం) ఓట్లు వేసారు. 1.72 శాతంతో కాంగ్రెస్ పార్టీకి 5.80 లక్షల ఓట్లు పోలవ్వగా నోటాకు 1.09 శాతం ఓట్లతో3.68 మంది ఓటు వేసారు. తుది లెక్కల్లో వీటిలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. టీడీపీ నుంచి పోటీ చేసిన గాజువాక అభ్యర్ది పల్లా 95,235 ఓట్లతో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు నెలకొల్పారు. తరువాతి స్థానాల్లో 90 వేలకు పైగా మెజార్టీ సాధించిన వారిలో గంటా శ్రీనివాస రావు, లోకేష్ ఉన్నారు. అదే విధంగా మడకశిరలో 351, గిద్దలూరులో 392 ఓట్ల తేడాతో ఫలితాలు మారిపోయాయి.
వైసీపీ అంతర్మధనం
ఈ లెక్కలతో టీడీపీకి 135, జనసేనకు 21, వైసీపీకి 11, బీజేపీకి 8 స్థానాలు దక్కాయి. తమ పార్టీకి వచ్చిన ఓట్లు, సీట్ల పైన జగన్ ప్రజా తీర్పును గౌరవిస్తూనే ఆవేదన వ్యక్తం చేసారు. తాను సంక్షేమ పథకాలు అందించిన లబ్దిదారుల సంఖ్య వివరించారు. అక్కా చెల్లెమ్మలు, రైతుల ఆప్యాయత ఏమైందంటూ ప్రశ్నించారు. ఇదే తరహాలో లోక్ సభ సీట్ల లోనూ కనిపించింది. జనసేన పోటీ చేసిన అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. ఇక..కేంద్రంలో మోదీ ప్రభుత్వంలోనూ టీడీపీ, జనసేన భాగస్వాములు కానున్నారు. ఏపీ ప్రభుత్వంలో జనసేన, బీజేపీ మంత్రులు చంద్రబాబు కేబినెట్ లో చేరనున్నారు. వైసీపీ ఓటమి పైన అంతర్మధనం మొదలైంది.












Click it and Unblock the Notifications