ప్రవీణ్ ప్రకాష్.. వాట్ నెక్స్ట్?
Praveen Prakash IAS: ఏపీ సీఎంఓ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. మాజీ అయ్యారు. సెప్టెంబర్ 30వ తేదీ- ఆయనకు లాస్ట్ వర్కింగ్ డే. మధ్యాహ్నం నుంచి వీఆర్ఎస్ అమలులోకి వచ్చింది.
1994 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్. రాష్ట్ర విభజన అనంతరం ఆయనను ఏపీకి కేటాయించింది డీఓపీటీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలక శాఖలను ఆయన పర్యవేక్షించిన విషయం తెలిసిందే.

ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చివేయడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నాడు-నేడు పథకాన్ని విజయవంతంగా అమలు చేయగలిగారు. ప్రాథమిక విద్యా వ్యవస్థను ఓ గాడిన పెట్టగలిగారు.
విధి నిర్వహణలో నిక్కచ్చగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు ఉందాయనకు. ఆ వైఖరే- ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైందనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ప్రభుత్వ పాఠశాల వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులను తీసుకుని రాగలిగారు.
ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా బయో మెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెట్టడం పట్ల టీచర్లు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. స్కూళ్లల్లో ఆకస్మిక తనిఖీలు చేయడం సైతం వాళ్లకు పెద్దగా నచ్చలేదు. సమయ పాలన పాటించేలా, ప్రభుత్వ బడులను పరిశుభ్రంగా ఉంచేలా చేయాలన్న ప్రవీణ్ ప్రకాష్ నిర్ణయాలను తప్పుపట్టారు.
ఇది- ఏకంగా జగన్ ప్రభుత్వానికే ఎసరు పెట్టిందనే అభిప్రాయాలు లేకపోలేదు. మొన్నటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓటమిపాలు కావడానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులకు అనుకూలంగా సంస్కరణలను ప్రవేశపెట్టడం కూడా ఓ కారణం అనే విశ్లేషణలు వెలువడ్డాయి.
మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంతో వీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 15 సంవత్సరాల సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ వైపు మొగ్గు చూపారు. ఈ ఏడాది జూన్ 25వ తేదీన వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి వీఆర్ఎస్ అమలులోకి వచ్చేలా జులై 9వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ జీవో జారీ చేశారు.












Click it and Unblock the Notifications