ఏ పోరుకైనా రెడీ: సమైక్యంపై జగన్, ఫస్ట్డే పార్టీపై దృష్టి
హైదరాబాద్: సమైక్యవాదంపై పోరాటానికి ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆస్తుల కేసులో అరెస్టైన జగన్ మంగళవారం సాయంత్రం చంచల్ గూడ జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే. ఆయన జైలు నుండి విడుదలైన తొలి రోజే పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు.
జగన్ తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, తాజీ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. సమైక్యవాదంపై వెనక్కి పోయే ప్రసక్తే లేదని నేతలతో చెప్పినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల విమర్శలను మనం సమర్థవంతంగా తిప్పి కోట్టాలని నేతలకు సూచించారు. సమైక్యవాదంపై ఆ రెండు పార్టీల వైఖరిని ప్రజల ముందుకు తీసుసు వెళ్తామని, వారి వైఖరిని ప్రజలకు చెబుతామన్నారు. సమైక్యవాదంపై ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఉద్యోగ సంఘాలు, సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి నాయకులకు చెబుతామని తెలిపారు.
జగన్ పార్టీ నేతలతో దాదాపు అరగంట చర్చించారు. ఇందులో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి? మిగిలిన రాజకీయ పార్టీలపై ఎలా ఒత్తిడి పెంచాలి? తదితర అంశాలపై జగన్ పార్టీ నాయకులతో చర్చించారు.