అది గుర్తించాలి: మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్పై బాబు కీలకవ్యాఖ్యలు, 'ముఖ్యనేత'పై మమత
Recommended Video
కోల్కతా/విజయవాడ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం భేటీ అయ్యారు. బీజేపీయేతర కూటమిపై వారు చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుకు మమతా బెనర్జీ ఘన స్వాగతం, నవంబర్ 22 భేటీ వాయిదా
బీజేపీయేతర కూటమి కోసం, ఆయా పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సహా పలువురు జాతీయస్థాయి నేతలను కలుస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం మమతా బెనర్జీని కలిశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే అంశంపై కీలకంగా చర్చించారు. అనంతరం మాట్లాడారు.
త్వరలో ఢిల్లీలో సమావేశమవుతాం
ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్ల రద్దు ఘోరంగా విఫలమైందని చంద్రబాబు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే తమ లక్ష్యమని చెప్పారు. త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఆ సమావేశం వాయిదాపడింది
బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి పని చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ నెల 22న ఢిల్లీలో ఏర్పాటు చేయాలనుకున్న సమావేశం అయిదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా వాయిదా పడిందన్నారు. పార్లమెంట్ శీతకాల సమావేశాలకు ముందే బీజేపీయేతర పక్షాల నేతలం అందరం సమావేశమవుతామని చెప్పారు.
పూర్తిగా బీజేపీ వ్యతిరేక కూటమి
అంతా ఏకతాటిపైకి వచ్చాక ఐక్య పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రణాళికను రూపకల్పన చేస్తామని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొనేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతితోనూ సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తమది పూర్తిగా యాంటీ బీజేపీ ప్లాట్ఫాం అని చెప్పారు.
కాంగ్రెస్ ప్రతిపక్షం.. కచ్చితంగా గుర్తించాలి
బీజేపీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న ప్రయత్నాలకు అందరి నుంచి మంచి మద్దతు లభిస్తోందని, ప్రతి ఒక్కరు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కాబట్టి, ఆ పార్టీకి మరింత బాధ్యత ఉంటుందని గుర్తించాలని చెప్పారు. ఈ విషయాన్ని మనమంతా కచ్చితంగా గుర్తించవలసిన అవసరం ఉందని చెప్పారు.
కూటమిని నడిపించబోయే నేత ఎవరంటే?
బీజేపీయేతర పార్టీలతో కలిసి ముందుకు సాగుతున్నామని మమతా బెనర్జీ అన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు కలిసికట్టుగా ముందుకు నడుస్తున్నామని చెప్పారు. ఇంతకుముందు కర్ణాటకలో చర్చలు జరిపామని తెలిపారు. 2019లో బీజేపీయేతర కూటమికి ఫేస్ ఎవరు, (నడిపించబోయే నేత అనే ఉద్దేశ్యంతో) ఎవరు బాధ్యులుగా ఉంటారని మీడియా ప్రశ్నించగా, మమతా బెనర్జీ స్పందిస్తూ కూటమిలోను అందరు ఈ కూటమికి ముఖ్య నేతలేనని చెప్పారు.