తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం నాడు భానుడి భగభగలతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. పనుల కోసం బయటికి వెళ్లాలనుకునే వారికి భానుడు చుక్కలు చూపించారు. రెండు రాష్ట్రాల్లో సరాసరిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కాగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రియల్ టైం గవర్నెన్స్ ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఈనేపథ్యంలోనే ఏపిలోని రాష్ట్ర్రవ్యాప్తంగా 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.
కాగా 127 చోట్ల 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. ఈనేపథ్యంలోనే రాష్ట్ర్ర వ్యాప్తంగా ఏపిలోని ఐదు జిల్లాల్లో ఎండలు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. వాటిలో ప్రకాశం జిల్లా టంగుటూరులో 45.36 డీగ్రీలు, దోనకొండలో 45.9 , క్రిష్ణా జిల్లా గుడ్లవల్లేరులో 43.97, జీ కొండూరులో 45.89, నెల్లూరు జిల్లా బ్రహ్మదేవంలో 44.9 ,గుంటూరు జిల్లా బాపట్లలో 43.33 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో సైతం ఇదే ఒరవడి కొనసాగింది. ఆదిలాబాద్ , ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీలకు పైగా నమోదు హైదరాబాద్ నగరంలో మాత్రం 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది.