పవన్ ఇప్పుడు చెప్పు, మీ మధ్య ఏముంది: బొత్స, అవిశ్వాసానికి బాబు నో చెప్పడం వెనుక..
Recommended Video
అమరావతి: కేంద్రంపై అవిశ్వాసం అవసరం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నారని, ఈ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. అవిశ్వాసం అవసరం లేదని చంద్రబాబు అనడాన్ని ఆయన తప్పుబట్టారు.
చదవండి: బాబుకు రివర్స్: బీజేపీ మంత్రుల రాజీనామా? మిస్టర్ సీఎం.. విష్ణు సంచలనం, గల్లాకు కౌంటర్
ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు విఫలమయ్యారని బొత్స ఆరోపించారు. రెండేళ్ల క్రితం కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై జాతీయ పార్టీలు కలిసి వస్తే తాము మద్దతుగా ఉంటామని చెప్పినప్పుడు టీడీపీ హోళన చేసిందన్నారు. ఇప్పుడు హోదా గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
చదవండి: ఏపీకి వస్తానంటే నో చెప్పారు: మోడీకి బాబు షాక్, ఆసక్తికర అంశాలు, కారణాలివీ
అలా అంటే మాకు చట్టాలు తెలియవా
ప్రత్యేక హోదాపై తాము చేసే పోరాటానికి తెలుగుదేశం పార్టీ కలిసి వస్తే మంచిదని బొత్స సూచించారు. పవన్ కళ్యాణ్ సూచన మేరకు తాము అవిశ్వాసానికి సిద్ధమని చెప్పామని, అలా అంటే తమకు చట్టాలు తెలియవా అని చంద్రబాబుపై మండిపడ్డారు. టీడీపీ, జనసేన మధ్య మిత్రుత్వం ఉందో లేదో పవన్ చెప్పాలని నిలదీశారు. ముందస్తు ఎన్నికలు రావని మంత్రి నారాయణ చెబుతున్నారని, ఆయన ఏమైనా ఎన్నికల కమిషనరా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్తో సహా ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతు
తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసినప్పుడు ఆ చట్టాలు ఏమయ్యాయని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉంది. దీనిపై బొత్స మాట్లాడుతూ.. హోదా కోసం ఏ పార్టీకి మద్దతిచ్చేందుకైనా తాము సిద్ధమని చెప్పారు.
నాలుగేళ్లు కాపురం చేసి మమ్మల్ని అంటారా
తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని కొందరు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, అది సరికాదని బొత్స విమర్శించారు. తాము బీజేపీతో కుమ్మక్కయితే అవిశ్వాస తీర్మానం పెడతామని ఎందుకు అంటామని చెప్పారు. బీజేపీతో టీడీపీ నాలుగేళ్లు కాపురం చేసి ఇప్పుడు తమను కుమ్మక్కు అనడం విడ్డూరమన్నారు. టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు.
కేసుల భయం వల్లే అవిశ్వాసానికి బాబు నో
పార్లమెంటులో కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీని పవన్ ఒప్పించాలని మరో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. తమకు ఉన్న బలం సరిపోదని, టీడీపీ కలిసి వస్తుందో రాదో చెప్పాలని నిలదీశారు. మోడీకి భయపడి చంద్రబాబు మాట్లాడటం లేదన్నారు. కేసుల భయం వల్లే అవిశ్వాసానికి చంద్రబాబు ముందుకు రావడం లేదని ఆరోపించారు.
చంద్రబాబు తేల్చి చెబితే జగన్ మాట్లాడుతారు
అవిశ్వాసం విషయంలో చంద్రబాబు తన వైఖరి చెబితే ఇతర రాజకీయ పక్షాలతో సంప్రదిస్తామని పెద్దిరెడ్డి అన్నారు. అవసరమైతే దేశంలోని ఇతర రాజకీయ పార్టీల మద్దతు కోసం జగన్ సంప్రదింపులు జరుపుతారని చెప్పారు. అవిశ్వాసంపై కాంగ్రెస్ సహా ఎవరు మద్దతిచ్చినా తీసుకుంటామని చెప్పారు.