ఎందుకయ్యా చిచ్చు పెడ్తున్నావ్, మాడి మసైపోతారు: పవన్కళ్యాణ్పై లోకేష్
గుంటూరు: నారా హమారా, టీడీపీ హమారా సభలో తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. వారు విభజన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ అంటే, పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర డిక్లరేషన్ అంటారని, నేను ఒక్కటే అడుగుతున్నానని, ఎందుకయ్యా మా మధ్య చిచ్చు పెడుతున్నారని ప్రశ్నించారు. తాను పుట్టే సమయానికి తన తాత ఎన్టీఆర్ సీఎం అని, నేను చెడ్డీలు వేసుకునే సమయానికి తన తండ్రి సీఎం అన్నారు.

పవన్-జగన్ ఆధారాలతో రండి
డ్వాక్రా మహిళలను ఆదుకున్న ఘనత చంద్రబాబుదే అని లోకేష్ అన్నారు. లోటు బడ్జెట్లో కూడా సంక్షేమానికి లోటు లేకుండా చేశారన్నారు. తన తాత, తన తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ రోజు వరకు తపై అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. కానీ తనపై జగన్, పవన్లు అవినీతి ఆరోపణలు చేశారని, నేను వారిన ఓ ప్రశ్న అడుగుతున్నానని, మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలతో సహా రావాలని సవాల్ చేశారు.

నిన్న అభివృద్ధి బాగుందని ఇప్పుడు అవినీతి అంటున్నారు
టిడిపి అవిశ్వాస తీర్మానం పెడితే పవన్ ఢిల్లీకి వచ్చి ఎవరినీ సమీకరించలేదని లోకేష్ ధ్వజమెత్తారు. పవన్ ఎందుకు ఢిల్లీకి రాలేదని, ఆయనకు బీజేపీతో ఎందుకు ఇంత లాలీచీ అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు ఏం తప్పు చేశారని వారితో లాలూచీ పడుతున్నారన్నారు. పొరపాటున జగన్, జనసేనలకు ఓటు వేస్తే అది కమలంకు వెళ్తుందన్నారు. బీజేపీలో.. బీ అంటే బీజేపీ, జే అంటే జగన్, పీ అంటే పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ బీజేపీ దత్తపుత్రుడు అన్నారు. నాడు ఏపీలో అభివృద్ధి బాగుందని చెప్పిన పవన్, ఇప్పుడు అవినీతి అంటూ యూటర్న్ తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారని, 2019లో ఇక్కడ సత్తా చూపిస్తారన్నారు.

మాడి మసైపోతారు
తెలుగు జాతితో పెట్టుకున్నారని, మాడి మసైపోతారని బీజేపీపై లోకేష్ నిప్పులు చెరిగారు. ఇందిరా గాంధీ నాడు ఎన్టీఆర్ను గద్దె దించితే తెలుగు ప్రజలు గర్జించారని, దీంతో 32 రోజుల్లో తిరిగి సీఎంగా చేశారని గుర్తు చేశారు. బీజేపీ నేతలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అంతేకానీ తెలుగు జాతి లోకి, మా చంద్రన్న జోలికి వస్తే మిమ్మల్ని తరిమితరిమి కొడతామని హెచ్చరించారు.
Recommended Video


అన్ని సీట్లు మనమే గెలవాలి
వచ్చే ఎన్నికల్లో మనం 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే మొత్తం ఎంపీ స్థానాలు గెలవాలని లోకేష్ అన్నారు. దేశ ప్రధానిని చంద్రబాబు నిర్ణయించబోతున్నారని చెప్పారు. కొందరు కులం, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టేవారు ఉంటారని, వారిని తరిమితరిమి కొట్టాలన్నారు. బీజేపీ నమ్మించి మోసం చేసిందన్నారు. జగన్ బీజేపీతో లాలూచీ పడ్డారని మండిపడ్డారు. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదని, జగన్ మోడీ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications