కొల్లాపూర్: హర్ష జోరు, జూపల్లిని ఐదోసారి ఆదరిస్తారా?
మహబూబ్నగర్: జిల్లాలోని కొల్లాపూర్ ఓటర్లు జూపల్లి కృష్ణా రావును ఐదోసారి ఆదరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఐదోసారి నియోజకవర్గం నుంచి విజయం సాధించడానికి ఆయన ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థిగా రంగంలోకి దిగారు. జూపల్లిని మట్టికరిపించి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే జోరు మీద కాంగ్రెసు అభ్యర్థి హర్షవర్దన్ రెడ్డి ఉన్నారు. బిజెపి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దతతో కటికినేని మధుసూదన్ రావు రంగంలో ఉన్నారు. ఆయన టిడిపికి రాజీనామా చేసి ఇటీవలే బిజెపిలో చేరారు.
తెరాస అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు వరుసగా అయిదోసారి ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణవాదం, అభివృద్ధి మంత్రంతో జూపల్లి కృష్ణారావు ఈసారి ఎన్నికల బరిలో దిగారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా జూపల్లి పనిచేశారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా 2011లో మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాసలో చేరారు.

2012 ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా జూపల్లి విజయం సాధించారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించారు. తెలంగాణ సెంటిమెంట్ని గౌరవిస్తూ మంత్రి పదవిని వదిలేసిన జూపల్లిపై తెరాసలో మంచి గుర్తింపే ఉంది. ఎన్నికల తర్వాత తెరాస ప్రభుత్వం ఏర్పడితే కీలకమైన మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆయన ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటిసారి బరిలో దిగిన బీరం హర్షవర్ధన్రెడ్డి అభివృద్ధి, సంక్షేమ నినాదాలను నమ్ముకున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. . పార్టీ సంప్రదాయ ఓట్ బ్యాంకును నమ్ముకొని ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. .
1994 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసి గెలుపొందిన కటికనేని మధుసూదన్రావు ఇటీవలే బిజెపిలో చేరి ఆపార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. 1999, 2004 ఎన్నికల్లోనూ కటికనేని టిడిపి అభ్యర్థిగా జూపల్లిని ఢీకొట్టారు. టిడిపి టికెట్ ఖరారయిందనే సమాచారంతో పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పగిడ్యాల శ్రీనివాస్రెడ్డి పొత్తుల్లో సీటును బిజెపికి ఇవ్వడంపై కినుక వహించారు. అధిష్ఠానం ఆదేశాలమేరకు బిజెపికి సహకరిస్తామని పార్టీ నాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications