'శంషాబాద్' ఘటన: యువతి అప్రమత్తంతో డ్రైవర్ పరార్
శంషాబాద్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన 26 ఏళ్ల యువతి గురువారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు మెహిదీపట్నంలో ట్యాక్సీ ఎక్కింది. ప్రయాణంలో డ్రైవరుతో మాట్లాడిన ఆమె తాను ఉద్యోగాన్వేషణలో భాగంగా విమానాశ్రయంలో ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు చెప్పింది.
ఏవైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే చెప్పాలని డ్రైవరును అడిగింది. ఈ మేరకు ఇద్దరు సెల్ ఫోన్ నంబర్లు ఇచ్చుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె ఇంటర్వ్యూ ముగిసిన అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో అదే డ్రైవర్ కనిపించాడు. దీంతో ఆ యువతి అదే కారులో తిరుగు ప్రయాణం అయింది.
అయితే, కారును మధ్యలో దారి మళ్లించినట్లుగా గుర్తించింది. ఆమె ఇదే విషయాన్ని డ్రైవర్ను అడిగింది. ఔటర్ రింగు రోడ్డు మీదుగా మెహిదీపట్నం వెళ్లవచ్చునని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన ఆమె తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అనంతరం డయల్ 100కు ఫోన్ చేసింది. కేకలు కూడా వేసింది.
దీంతో డ్రైవర్ అప్పా కూడలి సమీపంలో ఆమెను దింపి పరారయ్యాడు. శంషాబాద్ పోలీసులు, ఔటర్ రింగ్ రోడ్డు పెట్రోలింగ్ బృందం ఘటనస్థలికి చేరుకొని యువతిని గుర్తించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో విమానాశ్రయ సీసీటీవీ ఫుటేజీలను పరీశిలించి, సెల్ నంబర్ ఆధారంగా అతనిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, యువతి కిడ్నాప్ చేసేందుకు యత్నించిన కారు, కారు డ్రైవర్ ట్యాక్సీకి చెందినది కాదని, ప్రయివేటు వెహికిల్ అని చెబుతున్నారు.