అన్నా చెల్లెలు ఇలా తగులుకున్నారేంటీ
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
రైతుల అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని జగన్ ఎండగట్టారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవట్లేదంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. అమరావతిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్వీట్ రెండు గంటల వ్యవధిలో జగన్ ఈ పోస్ట్ పెట్టడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవట్లేదని జగన్ ఆరోపించారు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా అంటూ నిలదీశారు.
మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు.. ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదని జగన్ చెప్పారు. చొరవ చూపి, మార్కెట్లో ధరల్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను చంద్రబాబు విస్మరించారని విమర్శించారు. పైగా డ్రామాలతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
మిర్చి విషయంలో కూడా చంద్రబాబు రైతులను నమ్మించి మోసం చేశారని జగన్ గుర్తు చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారని చెప్పారు. క్వింటాలు 11,781 రూపాయలకు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారని ధ్వజమెత్తారు.
తన ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్ల రూపాయలు పెట్టి, అయిదు సంవత్సరాల్లో 7,796 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని జగన్ పేర్కొన్నారు. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నామని అన్నారు.
చంద్రబాబు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం తమ విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కాదా అని ప్రశ్నించారు. పైగా ఈ ఏడాది బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం దారుణం కాదా?.. ఈ 300 కోట్ల రూపాయల్లో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని జగన్ అన్నారు. జనాభాలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీశారు.
వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications