'ఢిల్లీలో విజయసాయితో జగన్ లాబీయింగ్, ఆస్తులకు విముక్తి, ఇదే నిదర్శనం'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం నిప్పులు చెరిగారు. కోట్ల రూపాయల ప్రజల సొమ్మును జగన్ లూటీ చేశారన్నారు.
వైసీపీ సభ్యులు పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా డ్రామాలు ఆడారన్నారు. వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు హర్షించరన్నారు. పట్టిసీమకు భూములు ఇవ్వకుండా రైతులను జగన్ అడ్డుకోబోయారన్నారు.

జగన్ భాష సరికాదు
చంద్రబాబుపై జగన్ చేసిన విమర్శలు సహా మాట్లాడిన భాష సరికాదని దేవినేని అన్నారు. జగన్ మాట్లాడే భాష అసహ్యించుకునేలా ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమమైన జగన్, లాలూచీ రాజకీయాలు నడుపుతున్నారన్నారు.

కేసుల నుంచి బయటపడేందుకు లాబీయింగ్
కేంద్రంతో లోపాయికారి వ్యవహారాలు నడుపుతోన్న జగన్ అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు వైసీపీ ఎంపీలతో లాబీయింగ్ చేయిస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి టీడీపీ బయటకు వచ్చిన అనంతరం జగన్ కేసులో గతంలో ఈడీ జప్తు చేసిన వేల కోట్ల ఆస్తులు బయటపడటమే దీనికి నిదర్శనమన్నారు.

అందుకే విజయసాయి రెడ్డి సహా వారు రాజీనామా చేయలేదు
కేసుల మాఫీపై లాబీయింగ్ చేసుకునేందుకే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా మిగతా సభ్యులను రాజీనామా చేయించలేదని మండిపడ్డారు. వైసీపీ ఎంపీలు ఏపీ భవన్లో నాలుగు గోడల మధ్య నిరసన కాకుండా ప్రధాని ఇంటి ముందు, ఢిల్లీ పురవీధుల్లో ఆందోళన చేయాలన్నారు.

చంద్రబాబుకు ప్రశ్నలు సరే, మోడీ మాటేమిటి?
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేసిన జగన్కు చంద్రబాబుపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. హోదాపై చంద్రబాబును జగన్ ఏడు ప్రశ్నలు అడిగారని, మరి ప్రధాని మోడీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మోడీని విమర్శిస్తే జైలుకు తిరిగి వెళ్లాల్సి వస్తుందనే భయంతో మాట్లాడటం లేదన్నారు.












Click it and Unblock the Notifications