'సాక్షి అవినీతి మీడియా అని తేలింది, ఎన్నారైలను చీల్చేందుకు జగన్ కుట్ర '
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు సోమవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. సాక్షి అవినీతి మీడియా అని సీబీఐ విచారణలో తేలిందన్నారు. అందువల్లే సాక్షి ఆస్తులను అటాచ్ చేశారన్నారు.
విదేశాలలో ఉన్న తెలుగు వారిని జగన్ తన రాజకీయాల కోసం చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తే క్షణంలో రాజీనామ చేస్తామని గతంలో తమ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రెఫరెండం కావాలంటే మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని జగన్కు సవాల్ విసిరారు. ఎన్నికలకు రండి... ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చూద్దామని గాలి తీవ్రంగా మండిపడ్డారు.
వెంకటగిరి ఎమ్మెల్యేపై ఆరోపణలు
రావూరు - కృష్ణపట్నం రైల్వే పనులకు రూ.5 కోట్లు ఇవ్వాలని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారని మంటెకార్లో కంపెనీ సెక్రటరీ ఆరోపించినట్లుగా సాక్షి మీడియాలో వార్త వచ్చింది. పనులకు ఆటంకం కలిగిస్తూ, తరుచూ ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారని పేర్కొంది. ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారని పేర్కొంది.