పార్లమెంట్ లో వీటిని అడగండి.. ఎంపీలకు జగన్ కీలక సూచనలు..!
ఈ నెల 10న తిరిగి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై వైసీపీ ఎంపీలకు అధినేత వైఎస్ జగన్ ఇవాళ దిశానిర్దేశం చేశారు. ఉభయ సభల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జగన్ పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ ఎంపీలు గట్టిగా గళం వినిపించాలని సమావేశంలో జగన్ ఆదేశించారు.
రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కాగా, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తు ఎంతో కీలకమని వైయస్ జగన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అన్నది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం అని, కేంద్ర క్యాబినెట్లో ఇద్దరు టీడీపీ మంత్రులు ఉన్నా, వారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించక పోవడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా టీడీపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎంపీలు తెలిపారు.

ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లేందుకు తాము వెనకాడ్డం లేదని, టీడీపీ ఎంపీలతో కలిసి ప్రధాని సహా కేంద్రంలో సంబంధిత మంత్రులను కలవాలని కూడా ప్రతిపాదించామని, కానీ టీడీపీ ఎంపీలు ముందుకు రాలేదని వైయస్సార్సీపీ ఎంపీలు వెల్లడించారు.పోలవరం ఎత్తు విషయంలో రాష్ట్రం తరఫున పార్లమెంటులో గట్టి పోరాటం చేయాలని, ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పార్టీ ఎంపీలను జగన్ ఆదేశించారు.
అలాగే ఆంధ్రుల హక్కుగా, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ప్లాంట్ను ఎలాగైనా కాపాడుకోవాలని, ఆ సంస్థ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా పార్టీ ఎంపీలు పోరాడాలని జగన్ నిర్దేశించారు.మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనపై రకరకాలుగా చర్చ జరుగుతోందని, దీని వల్ల ఉత్తరాదిలో పెరిగనట్లుగా దక్షిణాదిన సీట్లు పెరగవన్న ప్రచారం సాగుతోందని సమావేశంలో ఎంపీలు వెల్లడించారు. దీనిపై స్పందించిన జగన్, దీనిపై కేంద్రం నుంచి స్పష్టత కోరాలని సూచించారు.
అటు 'వన్ నేషన్. వన్ ఎలక్షన్'పై ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని గుర్తు చేసిన ఎంపీలు.. ఒకేసారి కేంద్రం, రాష్ట్రంలో జరిగే ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జగన్.. కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలని సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించిన దేశాలు కూడా, ఆ తర్వాత బ్యాలెట్ విధానానికి మళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో తాము పూర్తి చేసిన 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను పార్లమెంట్ లో ప్రస్తావించాలని కూడా జగన్ సూచించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, అన్ని రకాలుగా నిధులు, భూములు సేకరించి కాలేజీలను నిర్మించామని, కానీ ఈరోజు వాటిని ప్రైవేటుపరం చేస్తూ మంచి ఉద్దేశాలను నీరు గారుస్తున్నారని, అందుకే ఈ అంశాన్ని పార్లమెంటులో గట్టిగా ప్రస్తావించాలని ఆదేశించారు.
అలాగే జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు బట్టిన ఎంపీలు.. మాజీ ముఖ్యమంత్రిగా, జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నేతకు తగిన భద్రత కల్పించడం లేదని ఆక్షేపించారు. జగన్ గుంటూరు
మిర్చి యార్డు సందర్శన సమయంలో, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా విడిచి పెట్టబోమన్న వారు, ప్రజా నాయకుడిగా ఉన్న జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి, ఆయనకు భద్రతా సమస్యలు సృష్టించడానికి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. అందుకే ఈ విషయాన్ని కూడా పార్లమెంటులో గట్టిగా లేవనెత్తుతామని వైయస్సార్సీపీ ఎంపీలు వెల్లడించారు.












Click it and Unblock the Notifications