రాజధాని: మంత్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని జగన్!, ఆర్టీఐ ద్వారా ఖర్చు తెలుసుకో!
గుంటూరు: తనను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించవద్దని, పిలిచినా రానని చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారు! జగన్ మంత్రులకు అందుబాటులోకి రావడం లేదని వార్తలు వస్తున్నాయి.
జగన్ ఆహ్వానించవద్దని చెప్పినప్పటికీ... పిలవటం తమ బాధ్యత అని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా ఆహ్వానాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల నేతలను ఆహ్వానించే బాధ్యతలను కామినేని శ్రీనివాస రావు, అయ్యన్నపాత్రుడు, టిడి జనార్ధన్లకు అప్పగించారు.
మరోవైపు, జగన్ను ఆహ్వానించేందుకు మంత్రులు, టిడిపి ముఖ్య నేతలు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. మంత్రులు జగన్ ఫోన్కు పలుమార్లు ప్రయత్నించారని, అయితే జగన్ మాత్రం ఫోన్ ఎత్తడం లేదని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు మంత్రులు జగన్ను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ జగన్ నుంచి మాత్రం స్పందన లేదని అంటున్నారు. మంత్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో.. పిఏకు ఫోన్ చేశారని, అక్కడి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదని సమాచారం. బాధ్యతగల ప్రతిపక్ష నేతగా జగన్ శంకుస్థాపనకు రావాలని, ఈ విషయాన్ని జగన్ అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.
కాగా, అమరావతి వేడుక కోసం తనకు ఆహ్వానం పంపవద్దని, ఆహ్వానం ఇచ్చినా తాను రాలేదని ఆ తర్వాత అనవద్దని వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.

రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను రాకపోవడానికి ఎనిమిది కారణాలు ఉన్నాయని చెప్పారు. తనకు ఆహ్వానం పంపించవద్దని చెప్పారు. ఆహ్వానం ఇచ్చినా నేను రానని చెప్పారు. పేదల భూములను మీ అత్తగారి సొమ్ములా లాక్కున్నారని ధ్వజమెత్తారు. జగన్ తీరుపై మంత్రులు, టిడిపి నేతలు మండిపడ్డారు.
ఆర్టీఐ చట్టం ద్వారా వివరాలు పొందవచ్చు: సీఎం రమేష్
రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుకకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న విపక్షాల ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందిస్తోన్న విషయం తెలిసిందే. తాము వందల కోట్లు ఖర్చు చేయడం లేదని ఇప్పటికే మంత్రులు వివరణ ఇచ్చారు.
తాజాగా, ఎంపీ సీఎం రమేష్ మరో సూచన చేశారు. శుంకుస్థాపనకు ఎంత ఖర్చు చేస్తున్నామో... ఆర్టీఐ చట్టం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చునని జగన్కు హితవు పలికారు. రాజధాని నిర్మాణంలో అందరి భాగస్వామ్యం అవసరమని చెప్పారు.












Click it and Unblock the Notifications