కేసులు, ఆంక్షలతో మారిన జగన్ నిర్ణయం - కీలక నేతలకు పిలుపు..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓడిన జగన్ 2029 ఎన్నికల కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని చెబుతున్న జగన్.. పార్టీ నేతలకు ప్రజల్లోకి పంపారు. తన పర్యటనల వేళ వివాదాలు.. అనుమతుల సమస్యతో రూటు మార్చారు. తాను ఇక జనంలోనే ఉండాలని జగన్ నిర్ణయించారు. జిల్లాల పర్యటనలకు సిద్దం అయ్యారు. ముహూర్తం ఖరారు చేసారు. ఆ తరువాత పాదయాత్ర చేస్తానని మరోసారి జగన్ ప్రకటించారు.
కీలక నిర్ణయం
మాజీ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా కూటమి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. జగన్ పల్నాడు పర్యటన వేళ చోటు చేసుకున్న పరిణామాలు... కేసులతో జగన్ తన కార్యాచరణ లో మార్పు చేసారు. తాజాగా జరిగిన పార్టీ యువజన నేతల సమావేశంలో కీలక దిశా నిర్దేశం చేసిన జగన్.. యువతకు సీట్ల గురించి హామీ ఇచ్చారు. ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. తాను రాజకీయం గా ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులతో పాటుగా సక్సెస్ గురించి వివరించారు. ఇక.. ఈ నెల 8న వైఎస్ జన్మదినం కావటంతో జగన్ ఇడుపుల పాయకు వెళ్లనున్నారు. కడప నుంచే జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా జగన్ రెండు రోజుల పాటు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. స్థానికంగా పార్టీ పైన సమీక్ష చేయనున్నారు.

ఇక జనంలోనే
జిల్లాల పర్యటనలు పూర్తవుతూనే.. పాదయాత్ర కు జగన్ సిద్దం అవుతున్నారు. జమిలి ఎన్నికల దిశగా కేంద్రంలో జరుగుతున్న కసరత్తుకు అనుగుణంగా పాదయాత్ర షెడ్యూల్ ఖరారు కానుంది. అయితే, గతంలో చేసిన విధంగా కాకుండా.. ఈ సారి భిన్నంగా పాదయాత్రకు జగన్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అయితే, ఒక సారి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తరువాత రెండో సారి అదే విధంగా చేయటం ద్వారా ప్రజల నుంచి మద్దతు ఉంటుందా అనే చర్చ మొదలైంది. దీంతో, గతం కంటే భిన్నంగా ప్రణాళికల పైన కసరత్తు జరుగుతోంది. ఇటు కేసులు.. కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో రాజకీయంగా లక్ష్యం చేసుకొని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని జగన్ పార్టీ నేతలతో చెబుతున్నారు. దీంతో, ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు.
నెల్లూరు పర్యటన వాయిదా
ఇక.. ఈ నెల 3న జరగాల్సిన నెల్లూరు పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు. హెలికాప్టర్ పర్యటన కు అనుమతి విషయంలో వివాదం కొనసాగుతోంది. కాగా, ఇదే అంశం పైన వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు పిటీషన్ పైన విచారణ సాగనుంది. పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు సూచించింది. అటు జగన్ పర్యటన కోసం నెల్లూరు నేతలు మరో తేదీ ఖరారు చేయనున్నారు. అటు సింగయ్య కేసులో జగన్ తో పాటుగా పార్టీ నేతల పైన తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణా ల వేళ.. జగన్ వచ్చే వారం నుంచి రాజకీయంగా యాక్టివ్ కానున్నారు. ఈ మేరకు ఈ రోజు జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications