స్పీకర్గా కోడెల ఏకగ్రీవమే, టిడిపికి మద్దతుగా జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు పలికింది. సభాపతిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ పేరును పార్టీ ఖరారు చేసింది. స్పీకర్ పదవికి గురువారం నోటిఫికేషన్ విడుదలైనందున... ఆయన సాయంత్రం నామినేషన్ దాఖలు చేశారు.
స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం సాయంత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు మద్దతు పలకాలని కోరారు.
తెలుగుదేశం పార్టీ మద్దతు కోరడంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి.. నామినేషన్ పత్రాల పైన సంతకం చేశారు. జగన్ మద్దతు పలికినందున సభాపతి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎపి శాసన సభలో టిడిపి, అధికార టిడిపి మిత్రపక్షం బిజెపి, ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మాత్రమే ఉన్నాయి. కాంగ్రెసు పార్టీకి ఒక్క సభ్యుడు కూడా లేరు.
ఆరుసార్లు గెలిచిన కోడెల
సభాపతిగా కోడెల శివప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కోడెల నర్సారావుపేట నుండి గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆయన సత్తెనపల్లి నుండి పోటీ చేసి గెలుపొందారు. గతంలో మంత్రిగా పని చేశారు.