నేనొచ్చాక ఇస్తానని జగన్, మంగళగిరిలో షాకిచ్చారు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎదుట పలువురు కంటతడి పెట్టారు. జగన్ గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో మంగళవారం పర్యటిస్తున్నారు. ఆయన ఉదయం ఉండవల్లిలోని పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, కౌలు రైతులు, కూలీలు, మహిళలు తమ గోడు చెప్పుకున్నారు. పలువురు విలపించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కోని, వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. భూములు కోల్పోయిన రైతులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు. మూడేళ్లలో టీడీపీ పడిపోవడం ఖాయమని జగన్ అన్నారు. ఆ తర్వాత మనదే రాజ్యమని చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చాక, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేస్తామన్నారు. కేంద్రం కూడా బడ్జెట్లో నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రజలను నిరాశపర్చిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను మర్చిపోయారని జగన్ ఆరోపించారు.
కాగా, జగన్ పర్యటన ఉండవల్లి నుంచి ప్రారంభమైంది. రాజధాని ప్రాంతంలో ఉన్న రైతుల సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. ఉండవల్లి సహా పలు గ్రామాల్లో జగన్కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. జగన్ పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, లింగాయపాలెం, రాయపూడి, తుళ్లూరు తదితర గ్రామాల్లో జగన్ పర్యటించనున్నారు.
మంగళగిరిలో జగన్కు ఝలక్
రాజధాని కోసం ఏపీ సర్కారు చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన ఆందోళనలకు ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం ఎర్రబాలెంలో జగన్ గో బ్యాక్ అంటూ కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించగా ఘర్షణ వాతావరణం తలెత్తింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేశారు.