డబ్బా కొట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదు, సిగ్గేస్తోంది: బాబును ఏకేసిన జగన్
రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కృష్ణా: రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిసినప్పటికీ చంద్రబాబు నాయుడు వారి కష్టాలను పట్టించుకోవడం లేదని జగన్మోహన్రెడ్డి అన్నారు.
సోమవారం ఆయన కృష్ణాజిల్లా గన్నవరం నియోజక వర్గంలో బొమ్మలూరు, బాపులపాడులో పర్యటించారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచే విమానం ఎక్కుతానని, విజయవాడలోనే ఉంటానని డబ్బాలు కొట్టుకోవడం తప్ప రైతుల గురించి పట్టించుకోరని అన్నారు.
రైతులకు రుణాలు దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారికి రుణాలు ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని జగన్ విమర్శించారు. జిల్లాలో మినుము పంట పూర్తిగా ఎండిపోయిందని చెప్పారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే కృష్ణా డెల్టాలో కరవు వచ్చిందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం కనీసం సాగునీటిని అందివ్వలేకపోతుందని చెప్పారు.
రైతులకు నీళ్లు ఇవ్వకపోగా, బలవంతంగా భూములు లాక్కుంటారని అన్నారు. నియోజకవర్గంలో 18వేల ఎకరాలకు గాను.. వెయ్యి ఎకరాలే సాగు అవుతాయన్నారు. రైతుల పరిస్థితిపై సిగ్గుతో తలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజధాని ప్రాంతంలో మూడు, నాలుగు పంటలు పండే భూములు నీరు లేక ఎండిపోతున్నాయని వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.