రాజకీయ వ్యవస్థపై జగన్ ఆసక్తికర వ్యాఖ్య, బాబుపై తీవ్ర ఆగ్రహం
జంగారెడ్డిగూడెం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బుధవారం నాడు జంగారెడ్డి గూడెంలో సీఎం చంద్రబాబు పైన దుమ్మెత్తి పోశారు. ఆయన పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో బాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పొగాకు రైతులు ఇప్పుడు అతి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. రైతులు క్రాప్ హాలీడే ప్రకటిస్తున్నారన్నారు. వారికి హోంమంత్రి హెచ్చరికలు జారీ చేయడం విడ్డూరమన్నారు.
రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారన్నారు. రైతుల నుంచి ఇప్పుడు బ్యాంకులు అపరాధ రుణం వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అపరాధ వడ్డీ కట్టడానికి చంద్రబాబు కారణం కాదా అన్నారు. ఈ పరిస్థితిని ఆయన తీసుకు రాలేదా అని ప్రశ్నించారు.
'తరిమి కొడ్తాం.. సీఎం పాపం చేస్తున్నారు, బాబులో మార్పురాలేదు'
రైతులను ఆదుకునేందుకు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పారని, కానీ ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పింది ఒకటి, చేసింది ఒకటని ధ్వజమెత్తారు.
మోడీని అడిగే ధైర్యం లేదు
రైతులను ఆదుకోవాలంటే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకు రావాల్సిన అవసరముందన్నారు. టిడిపి ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారని, అలాంటప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకు వచ్చే బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
ఏపీకి రావాల్సినవి చెయ్యకుంటే మా మంత్రులను ఉపసంహరించుకుంటామని కేంద్రానికి చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదా అని నిలదీశారు. పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించే నాధుడే కరువయ్యాడని మండిపడ్డారు. పొగాకు పొంటను చంద్రబాబు ఎప్పుడు కొంటారని ప్రశ్నించారు.
రైతుల కోసం పోరాడాల్సిన చంద్రబాబు ఎందుకు అలా చేయడం లేదన్నారు. రైతుల కోసం చంద్రబాబు పైన ఒత్తిడి తీసుకు వచ్చే కార్యక్రమాన్ని తాము చేపడతామన్నారు. బాబు పైన ఒత్తిడి ఉంటేనే, ఆయన కేంద్రం పైన ఒత్తిడి చేస్తారని, అప్పుడు కేంద్రం పొగాకు రైతుల బాధలు పట్టించుకుంటుందన్నారు.
పరువు-ప్రతిష్ట: రాజధానే కాదు.. హైటెక్ బాబుకు 'బెజవాడ' పరీక్ష!
రాజకీయ వ్యవస్థ మారాలి
పామాయిల్ రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నాడు పామాయిల్ రూ.10వేలు పలికితే, ఇప్పుడు రూ.5,500 పలుకుతుందన్నారు. ఇచ్చిన మాట పైన నిలబడనప్పుడు, ఆ రాజకీయ నాయకుడిని నిలదీసినప్పుడే రాజకీయ వ్యవస్థ మారుతుందన్నారు. ఈ రాజకీయ వ్యవస్థ మారాలన్నారు.
నేను ఫలానా పని చేస్తానని ఓ రాజకీయ నాయకుడు చెప్పి ఓట్లు వేయించుకొని, ముఖ్యమంత్రి అయ్యాక, ఆ పనిని చేయనప్పుడు.. ఆయన సీఎంగా ఎలా చెల్లుబాటు అవుతారని ప్రశ్నించారు. ఇలా హామీలు ఇచ్చుకుంటూ పోతే ఇంకెవరైనా ప్రతి ఒక్కరికి విమానం, కారు కొనిస్తానని చెబుతారని ఎద్దేవా చేశారు.
రూ.5వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రాజెక్టులు కట్టాలనే ఉద్దేశం ఉందో లేదో నాకు అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుకు పనులు చేసే ఉద్దేశ్యం లేదని, రైతులు గొడవలు చేయాలని భావిస్తున్నారన్నారు.
ఓ ప్రాజెక్టు వద్ద ఓ రేటు, మరో ప్రాజెక్టు వద్ద మరో రేటు ఇస్తున్నారని, అలా చేస్తేనే రైతులు ఆందోళన చేస్తారని, అప్పుడు ప్రాజెక్టులు పూర్తి కావని చంద్రబాబు ఉద్దేశ్యమని అన్నారు. అందుకే అక్కడ ఓ ధర, మరోచోట మరో ధరకు భూమిని తీసుకుంటున్నారన్నారు.