రూటు మార్చిన జగన్- కీలక నిర్ణయాలు: విస్తృత భేటీకి పిలుపు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమౌతున్నారు. వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తోన్నారు.
ఇటీవలే పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించారు జగన్. తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారం, అసెంబ్లీ సమావేశాలు, టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు, శాంతిభద్రతలు, పార్టీ కార్యకర్తలపై దాడులు- అరెస్టులు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఇప్పుడు మరో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 24వ తేదీన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. దీనికి తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఇదివరకే పార్టీ నాయకులకు సమాచారం అందిందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ఏకంగా విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశానికి పార్టీకి రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ హాజరుకానున్నారు. వారితో పాటు ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పరిశీలకులు, సమన్వయకర్తలు కూడా పాల్గొననున్నారు. వారందరూ కూడా తప్పనిసరిగా ఈ భేటీకి హాజరు కావాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం.
కనీస మద్దతు ధర కోసం రాష్ట్రంలో రైతులు నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తెర తీసింది. దీనికి నిరసనగా ఇప్పటికే ఛలో మెడికల్ కాలేజీల ఆందోళనను నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. అటు నిరుద్యోగ భృతి కోసం యువత పట్టుబట్టుతోంది. ఈ పరిస్థితుల మధ్య జగన్ కీలక భేటీని నిర్వహించబోతోన్నారు. ఈ సమావేశంలో పార్టీ వ్యూహరచన, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications