అవినాష్ కు సుప్రీంలో షాక్- హైకోర్టు ఉత్తర్వుల కొట్టేవేత, జూన్ దాకా పొడిగింపు..!!
సుప్రీంకోర్టు సునీత పిటీషన్ పైన నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేసింది. అదే సమయంలో కేసు విచారణ గడువును ఈ నెలాఖరు నుంచి మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ జూన్ 30వ లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలనే అవినాష్ న్యాయవాది అభ్యంతరం పైన సీజేఐ కీలక వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణ హైకోర్టు ఆదేశాల పై వైఎస్ సునీత దాఖలు చేసిన పిటీషన్ పైన సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ సాగింది. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల పైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. వైఎస్ అవినాష్ ను ఈ నెల 25వ వరకు అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పైన సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ నెలాఖరులోగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉందని తన పిటీషన్ లో ప్రస్తావించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. విచారణ ఒక క్రమ పద్దతిలో సాగుతున్న సమయంలో ఇలాంటి ఆదేశాలు సరికాదని అభిప్రాయపడ్డారు.
హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పైన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 24 వరకు అవినాష్ ను అరెస్ట్ చేయవద్దని చెప్పింది. తిరిగి ఈ రోజు విచారణలో భాగంగా తిరిగి సునీత తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. సీబీఐ విచారణలో భాగంగా లిఖిత పూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలని హైకోర్టు సూచించటం పైన సునీత తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసారు. సుదీర్థ వాదనల తరువాత హైకోర్టు తీర్పు పైన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి తన అభిప్రాయం స్పష్టం చేసారు. లిఖిల పూర్వకంగా సీబీఐ ప్రశ్నలు ఇవ్వాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పు బట్టారు.
హైకోర్టు ఆదేశాలను సుప్రీం ధర్మానసం కొట్టివేసింది. ఈ నెలాఖరుతో ముగియాల్సిన విచారణ కాల పరిమితిని జూన్ వరకు పొడిగిస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో, అవినాష్ రెడ్డికి 24 గంటలు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది రంజిత్ కోరారు. దీనికి స్పందించిన సీజేఐ బెయిల్ మంజూరు చేస్తే తన తీర్పు కాంట్రడక్టరీ అవుతుందని వ్యాఖ్యానించారు. సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదని, సంయమనం పాటించిందని సీజేఐ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications