జగన్ ప్రజాసంకల్ప యాత్రకు నేటితో ఏడాది...పాదయాత్ర చరిత్రలో సరికొత్త రికార్డులు;మరెన్నో మైలురాళ్లు
విశాఖపట్టణం:రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తవుతోంది.
2017 నవంబరు 6న కడప జిల్లా ఇడుపులపాయలో జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తూ ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసితోనే తాను ప్రజా సంకల్ప యాత్ర చేపట్టినట్లు చెప్పారు. అలా మొదలూన జగన్ పాదయాత్ర గడచిన 12నెలల కాలంలో ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ 11 జిల్లాల గుండా సాగి ప్రస్తుతం 12వ జిల్లాలో కొనసాగుతోంది.

పాదయాత్ర ప్రారంభం...ఆ సందర్భంలో
2017,నవంబర్ 6 న ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద విజయమ్మ, షర్మిలతో కలసి జగన్ నివాళులు అర్పించిన అనంతరం తన ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ఆరంభం సందర్భంగా జగన్ మాట్లాడుతూ...."చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు.. కేసులకు భయపడే ప్రసక్తి లేదు...నాకున్నది ఒక్కటే కసి.. అది నేను చనిపోయిన తరువాతా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి, ప్రజల కుటుంబాల్లో ఆప్యాయతలు పంచాలన్నదే నా కసి, ఆ కసి నాలో ఉంది కాబట్టే ప్రజలకు, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాను. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే నా కసి"...అని చెప్పారు.

11 జిల్లాల్లో పూర్తి...ప్రస్తుతం 12 వ జిల్లాలో
గడచిన ఏడాది కాలంలో జగన్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల గుండా పాదయాత్రను కొనసాగించి ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పర్యటన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 వ తేదీన పాదయాత్ర నుంచి హైదరాబాద్కు బయల్దేరగా విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి ప్రాణహాని లేకుండా తృటిలో బైటపడిన జగన్ ఆ క్రమంలో భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.

పాదయాత్ర క్రమంలో...ఎన్నో మైలురాళ్లు
ఈ ఏడాది కాలంలో జగన్ ప్రజా సంకల్పయాత్ర...పాదయాత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ పలు మైలు రాళ్లను అధిగమిస్తూ కొనసాగుతోంది. సెప్టెంబర్ 24 న విజయనగరం జిల్లాలో అడుగిడిన అభిమాన నేత పాదయాత్ర అదే రోజున 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకోగా అక్టోబర్ 24 న సాలూరు మండలం బాగువలస వద్ద 3200 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మరో మైలురాయి చేరుకున్నారు. ఇందుకు గుర్తుగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించి, మొక్కను నాటి తమ పార్టీ జెండాను ఎగురవేసి ముందుకు సాగారు.

పాదయాత్రలో...‘నవరత్నాల’కు నాంది
పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను ఆలకిస్తూ ముందుకు సాగుతున్న ఆ క్రమంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ప్రకటించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన పాలనలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, గృహ నిర్మాణం, 108 వంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల ఆదరాభిమానాలు పొందడంతో పాటు తనదైన సంక్షేమ విప్లవంతో దేశంలోనే మిగిలిన పాలకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలా మహానేతగా గుర్తింపు పొందిన తన తండ్రి, దివంగత వైఎస్ కంటే మరింత పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో తన ఆశయాలకు అనుగుణంగా ‘నవరత్నాలు'ను రూపొందించారు జగన్. జగన్ నవరత్నాలకు ఊహించినదానికంటే ఎక్కువ ప్రజాస్పందన లభించింది.

పాదయాత్రలో...జనాల హోరు
పాదయాత్రలో తనను చూసేందుకు,కలిసేందుకు భారీగా పోటెత్తుతున్న జనాల తీరు కొన్ని సందర్భాల్లో రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తే స్థాయిలో ఉందంటే అతిశయోక్తిలేదు. భారీగా తరలివస్తున్న మహిళలు, యువకులు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది సెల్ఫీలు తీసుకున్నారు. ఇలా పాదయాత్రతో ప్రజలతో మమేకమవుతూ వారి కష్టనష్టాలను, సాధకబాధకాలను ఓపిగ్గా వింటూ.. భరోసా ఇస్తూ సాగిపోతున్న జగన్ పై అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. తమ అభిమాన నాయకుడు త్వరగా కోలుకొని మళ్లీ పాదయాత్ర కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
విశాఖలో కుమారస్వామి- స్టీల్ ప్లాంట్ రోడ్ మ్యాప్ ఆయన చేతిలో -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications