కీలక జిల్లాల్లో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ - టచ్ లోకి ముఖ్య నేతలు..!!
ఏపీ రాజకీయాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వరుసగా ఇంఛార్జ్ లను మార్చుతూ జాబితాలను విడుదల చేసిన వైసీపీ గ్యాప్ ఇచ్చింది. టీడీపీ,జనసేన అభ్యర్దుల జాబితా విడుదల అయింది. రెండు పార్టీలు 99 మంది అభ్యర్దులను ప్రకటించాయి. టీడీపీ 94, జనసేన 5 మందిని బరిలోకి దించింది. రెండు పార్టీల నుంచి సీట్లు దక్కని ఆశావాహులు పక్క చూపులు చూస్తున్నారు. వీరి పైన వైసీపీ గురి పెట్టింది. ఆపరేష్ ఆకర్ష్ లో భాగంగా ముఖ్య నేతలను రంగంలోకి దించింది.
హోరా హోరీ
ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. వైసీపీలో సీట్ల దక్కని నేతలు టీడీపీ, జనసేనలోకి చేరారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో సీట్లు రాని నేతల పైన వైసీపీ ఫోకస్ చేసింది. ప్రధానంగా ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల కేంద్రంగా వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. టీడీపీలో సీట్లు దక్కని వారిని చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేసారు. కొందరు సీనియర్లు మెత్తబడ్డారు. పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరి కొందరు నేతలు మాత్రం రాజకీయంగా ప్రత్యామ్నాయ అవకాశాల వైపు చూస్తున్నారు. దీంతో, అభ్యర్దుల కసరత్తుకు బ్రేక్ ఇచ్చిన వైసీపీ నేతలు ఎవరు తమ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది..వారి బలా బలాలు ఏంటనేది ఆరా తీస్తోంది. మూడు జిల్లాల ముఖ్య నేతలతో స్పెషల్ టీం ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తోంది.

ఆపరేషన్ ఆకర్ష్
గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన పొత్తుతో వైసీపీని గట్టి దెబ్బ కొట్టాలనేది చంద్రబాబు, పవన్ వ్యూహం. అక్కడ ఇప్పుడు సీట్ల వ్యవహారం సమస్యగా మారింది. సీట్ల సర్దుబాటులో సీనియర్లను పక్కన పెట్టటంతో వారు తమ అనుచర వర్గంతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీల్లోని కొందరు ముఖ్య నేతలతో వైసీపీ టచ్ లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖ ఉమ్మడి జిల్లాలో టీడీపీలో ఒక వెలుగు వెలిగిన కీలక నేతకు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అయితే, ఆ నేత తనకు సీటు రాదని తేలితేనే స్పష్టత ఇవ్వగలుగుతానని చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీ వీడీ సీటు కోసం టీడీపీలోకి వెళ్లిన మరో నేత కుటుంబానికి నిరాశ మిగిలింది. దీంతో, వారు తిరిగి వైసీపీ గూటికే చేరుకొనేందుకు మంత్రాంగం ప్రారంభించారు.
కీలక నేతలపై గురి
గోదావరిలో రెండు పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో..పవన్ తమకు కేటాయించిన సీట్లను ప్రకటించే విషయంలోనూ ఆచితూచి వ్యవహిస్తున్నారు. నిడుదవోలు, కాకినాడ రూరల్, కొత్తపేట, తణుకు, పిఠాపురం, భీమవరం, తాడేపల్లి గూడెం, కాకినాడ సిటీ, పెందుర్తి, భీమిలి వంటి సీట్లకు రెండు పార్టీల నుంచి పోటీ ఉంది. దీంతో..వైసీపీ తమ ఆపరేషన్ ముమ్మరం చేసింది. ముఖ్య నేతలు పార్టీలోకి వస్తే వారికి దక్కే ప్రాధాన్యత పై స్పష్టత ఇస్తున్నారు. ఈ నెల 3వ తేదీన అద్దంకిలో జరిగే సిద్దం సభ తరువాత వైసీపీలో ఈ రెండు పార్టీల నుంచి కొందరు ముఖ్యుల చేరికలు ఉంటాయని సమాచారం. దీంతో..ఎవరి రాజకీయ అడుగులు ఎటు వైపు ఉంటాయనే ఉత్కంఠ గోదావరి జిల్లాల్లో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications