పవన్.. పోటీపై క్లారిటీ ఇస్తావా ? లేదా ? ఒత్తిడి పెంచేస్తున్న వైసీపీ..!
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారు. ఇందులో ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిత్యం విరుచుకుపడుతున్నారు. వారాహి యాత్ర ఆరంభంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరిన పవన్, ఆ తర్వాత ఏకంగా ముఖ్యమంత్రిని చేయాలని జనాన్ని అడిగారు. దీంతో వైసీపీ ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టింది. అయితే ఆ తర్వాత మాత్రం పోటీపై మౌనం వహించారు.
వారాహియాత్రలో పవన్ కళ్యాణ్ తనను ఎమ్మెల్యే చేయాలని, సీఎం చేయాలని ఓటర్లను కోరినా .. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నది మాత్రం చెప్పలేదు. ఇప్పటికీ పవన్ ఎక్కడ పోటీ చేస్తారన్న దానిపై జనసేనలో ఎవరికీ ఓ క్లారిటీ ఉన్నట్లు లేదు. దీనిపై పవన్ వారాహి యాత్రలో క్లారిటీ ఇస్తారని ఇన్నాళ్లు ఎదురుచూసిన వైసీపీ నేతలు.. ఆయన మౌనంతో ఇవాళ ఒక్కసారిగా ప్రశ్నలు మొదలుపెట్టారు.

పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారన్న దానిపై గందరగోళంలో ఉన్నారని, గతంలోలా రెండు నియోజకవర్గాలు వెతుక్కునే పనిలో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ముందుగా ట్వీట్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చిన సాయిరెడ్డి.. విపక్ష నేతలంటూ చంద్రబాబుతో కలిపి ఆయన్ను టార్గెట్ చేశారు. కానీ చంద్రబాబుకు తన పోటీపై క్లారిటీ ఉంది. దీంతో సాయిరెడ్డి ట్వీట్ పవన్ ను ఉద్దేశించే అని తేలిపోయింది.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి సీదిరి అప్పలరాజు కూడా పవన్ ను ఇదే విషయంపై ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పాలని అప్పలరాజు డిమాండ్ చేసారు. అయినా పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు. ఈసారి పవన్ కళ్యాణ్ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడో ముందుగానే చెప్పాలని మంత్రి కోరారు. తద్వారా ఆయన కూడా పవన్ నియోజకవర్గంపై క్లారిటీ కోసం ఒత్తిడి పెంచినట్లయింది.












Click it and Unblock the Notifications