సొంతగూటికి చేరుకుంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు: టీడీపీకి రాజీనామా చేసిన వరుపుల! త్వరలో జయరాములు కూడా?
కాకినాడ: ఎన్నికలు ముంచుకు వచ్చిన ప్రస్తుత తరుణంలో తెలుగుదేశం పార్టీలో టికెట్ దక్కని ఫిరాయింపు ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరుకంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఈ అంగం ఆరంభమైనట్టు కనిపిస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ.. తాను టీడీపీలో ఇమడలేకపోతున్నానంటూ వరుపుల సుబ్బారావు చెబుతున్నారు. పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపించారు. రేపో, మాపో ఆయన వైఎస్ఆర్ సీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి.
ఆయనతో పాటు కడప జిల్లాకు చెందిన మరో ఫిరాయింపు ఎమ్మెల్యే జయరాములు కూడా టీడీపీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా వైఎస్ఆర్ సీపీ వైపు చూపులు సారించినట్లు సమాచారం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరుపుల సుబ్బారావు ప్రత్తిపాడు స్థానం నుంచి వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేసి, విజయం సాధించారు. అనంతరం చోటు చేసుకున్నరాజకీయ పరిణామాల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సారి ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సుబ్బారావుకు బదులుగా మనవడు వరుపుల రాజాకు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన సుబ్బారావు పార్టీని వీడారు. తన అనుచరులతో గురువారం ప్రత్తిపాడులో సమావేశమైన ఆయన.. వారి అభీష్టం మేరకు టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన వైఎస్ఆర్ సీపీలో చేరుతారని తెలుస్తోంది. దీనికోసం ఆ పార్టీ అగ్ర నాయకత్వంతో ఇప్పటికే మంతనాలు నిర్వహించినట్లు చెబుతున్నారు.
టిడిపి ఎంపీగా బరిలోకి వంగవీటి రాధా : వైసిపి లో ఇస్తామన్నదీ ఇదే : టార్గెట్ ఫిక్స్..!
వరుపుల సుబ్బారావు తిరిగి పార్టీలో చేరితే.. ప్రత్తిపాడు సీటును ఆయనకే కేటాయిస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే- 2014లో ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, సుబ్బారావు చేతిలో ఓడిపోయిన పర్వత సత్యనారాయణ మూర్తి, బాపనమ్మ దంపతులు ఇప్పటికే వైఎస్ఆర్ సీపీలో చేరారు. దీనితో టికెట్ల సర్దుబాటును ఎలా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
జయరాములు కూడా..
కడప జిల్లా బద్వేలుకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే జయ రాములు కూడా టీడీపీని వీడాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ ఆయనకు కూడా టికెట్ ఇవ్వలేదు. బద్వేలులో కొత్త ముఖాల కోసం అన్వేషిస్తోంది. తనకు టికెట్ రాదనే విషయం ఖాయం కావడంతో జయరాములు ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్ బలవంతం మీద, టికెట్ ఖాయం చేస్తారనే భరోసాతో తాను టీడీపీలో చేరానని జయరాములు చెబుతున్నారు. తనను పార్టీ ఫిరాయింపజేసినందుకు జూపూడి ప్రభాకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మూడు కోట్ల రూపాయలను తీసుకున్నారని, తనకు 50 లక్షల రూపాయలను మాత్రమే ఇచ్చారని జయరాములు తాజాగా ఆరోపిస్తున్నారు. ఆయన పార్టీని వీడటం దాదాపు ఖాయమైనట్టేనని అంటున్నారు.