వైసీపీ ఎమ్మెల్యేకు బీజేపీ టికెట్ ఖరార్: టిక్ కొట్టిన చంద్రబాబు
MLA Varaprasad: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడులైన వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు. టికెట్ దక్కుతుందనే ఉద్దశంతో ప్రత్యామ్నాయ పార్టీల కండువాలను కప్పుకొంటోన్నారు.
వైఎస్ఆర్సీపీ, టీడీపీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేశినేని నాని, నల్లగట్ల స్వామిదాస్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, డాక్టర్ సంజయ్ కుమార్, కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి వంటి నాయకులు పార్టీలను ఫిరాయించిన నాయకుల జాబితాలో ఉన్నారు.

ఈ జాబితాలో తాజాగా వైఎస్ఆర్సీపీకే చెందిన మరో నాయకుడు చేరారు. తిరుపతి జిల్లా గూడూరు శాసన సభ్యుడు వెలగపల్లి వరప్రసాద్ రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొన్నారు. దీనితో- తిరుపతి లోక్సభ నియోజకవర్గం టికెట్ను వరప్రసాద్కు కేటాయించడం దాదాపుగా ఖరారైనట్టే. ఈ టికెట్ ఇవ్వాలనే షరతుతోనే ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారని చెబుతున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వరప్రసాద్ తిరుపతి లోక్సభ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019లో ఆయన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. గూడూరు సీట్ను మేరిగ మురళీధర్కు కేటాయించింది. దీనితో వరప్రసాద్.. వైసీపీకి గుడ్బై చెప్పారు.












Click it and Unblock the Notifications