మోదీకి దగ్గరై ఏం సాధించారు?- ఆధార్ అడిగితే బేడీలా? -‘ట్రావెన్కోర్’ ట్యాక్సులంటూ వైసీపీ ఎంపీ ఫైర్
రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా భూములిచ్చిన స్థానిక రైతులు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టగా, మూడు రాజధానులకు అనుకూలంగా పోటీ ఉద్యమకారులు వెళ్లడం.. వారిని అడ్డుకున్నారనే కారణంతో రైతులకు బేడీలు వేసి అరెస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. రైతులకు సంకెళ్లు వేయడం దారుణమని, అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోన్న జగన్ పై జనం తిరగబడే రోజులు వస్తాయని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయనేమన్నారంటే...
నిమ్మగడ్డతో ఢీ: జగన్కు భగపాటు - కేంద్ర బలగాలతో ఏపీలో ఎన్నికలు - సుప్రీంకోర్టు చెప్పిందిదే: రఘురామ
ఆటో ఆర్టిస్టుల్ని అడిగితే..
‘‘ప్రధాని శంకుస్థాపన చేసిన చోట అమరావతి రైతులు గాంధేయ పద్ధతిలో దీక్షలు చేశారు. దాన్ని భగ్నం చేయడానికి వైసీపీ నేతలే కొందరు ఆటో ఆర్టిస్టుల్ని తీసుకొచ్చారు. ఆ సందర్భంలో.. ఆటోలో వచ్చిన వాళ్లు ఎక్కడివారో తెలుసుకునేందుకు ఆధార్ కార్డులు అడిగారు. కనీసం గొడవ కూడా జరగలేదు. వచ్చింది ఎస్సీలని కూడా ఎవరికీ తెలీదు. ఈ మాత్రానికే రైతులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఏదో కన్నాలేసేవాళ్లను తీసుకెళ్లినట్లుగా అన్నం పెట్టే రైతులకు బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్లారు. అన్నం తినే ప్రతి ఒక్కరూ దీనిపై నిరసన తెలపాలి. ఇది పోలీసుల తప్పా, ప్రభుత్వం తప్పా అనేది తేలాలి. నేను కూడా వైసీపీకి చెందినవాడినే కాబట్టి పార్టీ, ప్రభుత్వం తరఫున అమరావతి రైతులకు క్షమాపణలు చెబుతున్నాను. అసలు..
ప్రవీణ్ ప్రకాశ్ పని పట్టాల్సింది జగనే -చెప్పు దెబ్బలు -షాకింగ్ సర్వే చూశారా?: ఎంపీ రఘురామ
చెప్పిందేంటి? చేస్తున్నదేంటి?
వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఏవైతే హామీలిచ్చామో వాటిపై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వాలి. ‘స్నేహమేరా జీవితం' అని కేంద్రం, ఏపీ డ్యూయెట్లు పాడుతోందని వైసీపీ పెద్దలే చెబుతున్నారు. మరి అంత అనుబంధం ఉంటే ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? అమరావతి ప్రోగ్రెస్ లేదు.. రైల్వే జోన్ లేదు.. తాజాగా పోలవరంపై సందిగ్ధత. అసలు మోదీతో స్నేహం వల్ల జగన్ సాధించింది ఏంటి? ఏది అవసరమని ప్రజలకు చెప్పి మనం అధికారంలోకి వచ్చామో.. వాటిని నెరవేరుద్దామా? మనమిచ్చిన హామీలను ప్రయారిటీ లెక్కల ప్రజలకు వివరించాలి. ప్రత్యేక హోదా సాధ్యం కాకుంటే ప్రత్యామ్నయం ఏంటని ఆలోచించాలి.
బీజేపీ వాళ్లకు పట్టింపు లేదు
రెండ్రోజుల కిందట సీఎం జగన్ రైతు భరోసా పేరుతో సబ్సిడీ ఇచ్చారు. అందులో కొంత వాటా కేంద్ర ప్రభుత్వానిది కూడా ఉంది. గతేడాది ఇదే స్కీముకు నేను చొరవ తీసుకుని ‘ప్రధానమంత్రి-వైఎస్సార్ రైతు భరోసా'అని ప్రకటించాం. ఈ ఏడాది మాత్రం ప్రధాని పేరును తొలగించారు. ఇప్పుడు నేను చెబితే మావాళ్లు వినే పరిస్థితి లేదు. చాలా పథకాల్లో 60 శాతం వాటా కేంద్రానిదే అయినా పేరు మాత్రం జగనన్నదే పెడుతున్నారు. సింహభాగం నిధులిస్తోన్న కేంద్రాన్ని విస్మరించడం వల్లే ఏపీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది. ఈ విషయంలో ఏపీ బీజేపీ వాళ్లకు పట్టింపులేదు. బాధ్యత గల ఎంపీగా ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై నేను ప్రధాని మోదీకి ఫిర్యాదులు చేస్తున్నాను. చర్చిలకు ప్రభుత్వ నిధులు, పాస్టర్లకు భృతిపై ప్రధానికి ఇటీవలే లేఖ రాశాను.
Recommended Video
ట్రావెన్ కోర్ తరహా ట్యాక్సులు..
ఏపీలో రోడ్ టాక్సులు చూస్తుంటే.. ట్రావెన్ కోర్ సంస్థానంలో అమలైన బ్రెస్ట్ ట్యాక్సులు(మహిళలు జాకెట్ ధరించాలంటే పన్ను కట్టడం), కొండవీడు ప్రాంత పాలకుడు అలవేమారెడ్డి.. ప్రజలు వంట చేసుకోడానికి పొయ్యి వెలిగిస్తే సుంకం, పిల్లల్ని కంటే పన్నులు వసూలు చేసిన వైనం గుర్తుకొస్తున్నాయి. హారన్ కొట్టినా, చెకింగ్ సమయంలో పోలీసులను చూసి నవ్వినా పన్నులు వేస్తామనడం భావ్యం కాదు. గత ఫెయిల్యూర్ రాజ్యాల మాదిరిగా జగన్ నిలిచిపోరాదు. ప్రజల ప్రాణాల పేరుతో ఇంత పెద్ద మొత్తంలో ట్యాక్సులు కరెక్టుకాదు. ప్రజలందరూ తిరగబడేలోపే వాటిని రద్దు చేసుకోవాలి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.