అమిత్ షాతో రఘురామ భేటీ-అమరావతికి మద్దతుపై థ్యాంక్స్-జగన్ పై ఫిర్యాదులు ?
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే కొంతకాలంగా పోరాటం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. చాలా కాలం తర్వాత అమిత్ షాను కలిసిన రఘురామ.. ఏపీలో జరుగుతున్న పరిణామాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జగన్ సర్కార్ పై పలు అంశాల్ని ఫిర్యాదుల రూపంలో షాకు అందించినట్లు తెలుస్తోంది.
ఏపీలో పరిస్థితులు, అమరావతి రైతుల పాదయాత్రపై పోలీసుల లాఠీఛార్జ్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను అమిత్షాకు రఘురామ వివరించినట్లు తెలుస్తోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి అమిత్ షా మద్దతు ఇవ్వడంపై రఘురామరాజు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలో బీజేపీ నేతలతో మాట్లాడాకే 3 రాజధానులపై సీఎం జగన్ వెనక్కు తగ్గారని రఘురామ అమిత్ షాతో భేటీ అనంతరం వెల్లడించారు. అమరావతికి బీజేపీ మద్దతు వెనుక అమిత్ షా సూచన ఉన్న నేపథ్యంలో ఆయనతో ఈ వ్యవహారంపై రఘురామ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
అలాగే ఏపీలో ఆర్ధిక పరిస్దితి నానాటికి దారుణంగా మారుతోందని అమిత్ షాకు రఘురామ వివరించినట్లు తెలుస్తోంది. అప్పుల కోసమే కొత్త అప్పులు చేస్తుండటం, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నట్లు అమిత్ షాకు రఘురామ చెప్పినట్లు సమాచారం. తాజాగా వెలువడిన కాగ్ రిపోర్ట్ ను సైతం రఘురామ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అలాగే బీజేపీ మద్దతిస్తున్న అమరావతి మహా పాదయాత్ర, జగన్ సర్కార్ మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు కూడా అమిత్ షాకు రఘురామ వివరించారని చెప్తున్నారు. మరి వీటిపై అమిత్ షా స్పందన ఏంటన్నది ఇంకా బయటికి రాలేదు.
వాస్తవానికి రఘురామరాజు అనర్హత వేటుపై వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు లోక్ సభ స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉండటం, గతంలో దీనిపై వెంటనే చర్యలు తీసుకునేలా సూచనలు ఇవ్వాలని అమిత్ షాను సీఎం జగన్ కోరినా స్పీకర్ పట్టించుకోకపోవడం వంటి పరిస్ధితుల మధ్య అమిత్ షాను రఘురామ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే వైసీపీ ఫిర్యాదులపై కేంద్రం మౌనంగా ఉంటున్న నేపథ్యంలో రఘురామ గేరు మారుస్తున్నట్లు తెలుస్తోంది.