ఏ ఒక్కర్నీ వదిలేలా లేదే? కరోనా బారిన పడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి: ఆసుపత్రికి: బెంగళూరులో 60 వేలకు
బెంగళూరు: కరోనా వైరస్ ఏ ఒక్కర్నీ వదిలేలా కనిపించట్లేదు. తర తమ భేదాలను చూడట్లేదు. ధనిక, పేద అనే వర్గ భావన దానికి లేదు. కులం, మతం గురించి పట్టించుకోవట్లేదు. వ్యాపిస్తోనే ఉంది. ఈ వైరస్ను నియంత్రించడానికి తీసుకుంటోన్న ఏ ఒక్క చర్యకు కూడా అది లొంగట్లేదు. పైగా మరింత విజృంభిస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలో కరోనా లక్షణాలు కనపించాయి. ఆయన ఆసుపత్రిలో చేరారు. తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ అవే లక్షణాలతో హోమ్ క్వారంటైన్కు వెళ్లిపోయారు.
Recommended Video
మణిపాల్ ఆసుపత్రిలో చేరిన యడ్డీ..
తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో తాను ఆసుపత్రిలో చేరానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొన్నారు. డాక్టర్ల సలహా మేరకు తాను ముందుజాగ్రత్త చర్యగా తాను ఆసుపత్రిలో చేరానని అన్నారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా వైద్య పరీక్షలను చేయించుకోవాలని 77 సంవత్సరాల యడియూరప్ప విజ్ఙప్తి చేశారు.
తరచూ సమీక్షలతో
కర్ణాటకలో కరోనా వైరస్ వీర విజృంభణ కొనసాగిస్తోంది. దీన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై యడియూరప్ప తరచూ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. బెంగళూరు విధానసౌధ సహా తన అధికారిక నివాసంలో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యక్షంగా భేటీ అవుతున్నారు. అన్ని ముందు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. జిల్లాల నుంచి వచ్చిన కొందరు పార్టీ నేతలనూ తరచూ కలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
అసింప్టోమేటిక్
నిజానికి- యడియూరప్పలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తలేదు. ముందుజాగ్రత్తగా ఆయన తరచూ కరోనా వైద్య పరీక్షలను చేయించుకుంటున్నారు. ఆదివారం రాత్రి చేయించుకున్న పరీక్షల్లోపాజిటివ్గా నిర్ధారణ అయింది. రోగ లక్షణాలు కనిపించనప్పటికీ.. పాజిటివ్గా తేలారు. వెంటనే ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలను చేశారు. ఆసుపత్రికి తరలించారు. తాను బాగానే ఉన్నానని, త్వరలో డిశ్చార్జి అవుతానని యడియూరప్ప పార్టీ నాయకులకు ధైర్యం చెప్పారు.
గెట్ వెల్ సూన్ అంటూ..
యడియూరప్పకు కరోనా సోకిన విషయం తెలియడంతో రాజకీయ పార్టీల నేతలు ఉలిక్కిపడ్డారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ల ద్వారా సందేశాలను పంపించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపీకి చెందిన ఉడుపి-చిక్మగళూరు లోక్సభ సభ్యురాలు శోభా కరంద్లాజె, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రె వంటి ప్రముఖులు ట్వీట్ల ద్వారా సందేశాలను పంపించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
బెంగళూరులో 60 వేల వరకు
ఉద్యాననగరి బెంగళూరులో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలో 59,501 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం సాయంత్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. 24 గంటల్లో బెంగళూరులో 2105 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 21 మంది మరణించారు. కర్ణాటక వ్యాప్తంగా లక్షా 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వేల సంఖ్యలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతోన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ఇప్పటికే కర్ణాటక అటవీశాఖ మంత్రి ఆనంద్ సింగ్, పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి కరోనా బారిన పడ్డారు.