మళ్లీ వాత పెట్టడం మొదలుపెట్టిన కేంద్రం: వాటి రేట్లు పెంపు
కేంద్ర ప్రభుత్వం మరోసారి రేట్ల పెంపునకు శ్రీకారం చుట్టింది. వాహనదారులపై అదనపు భారాన్ని మోపింది. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలను అమాంతం పెంచేసింది. ఢిల్లీ, నొయిడా, గ్రేటర్ నొయిడా, ఘజియాబాద్ వంటి ఎన్సీఆర్ పరిధిలో నివసించే వాహనదారులపై తాజాగా అదనపు ఆర్థిక భారం పడింది. ఈ మేరకు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఒకేసారి కేజీ సీఎన్జీపై రూ. 3.89 మేర పెంచుతూ ఐజీఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. నూతన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. ఈ తాజా పెంపుతో ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర ప్రస్తుతం రూ. 86.98 పైసలకు చేరింది. ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు నడిపే యజమానులకు ఈ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బగా మారింది. తక్కువ ఖర్చుతో ప్రయాణాల కోసం సీఎన్జీ వాహనాలను ఎంచుకున్న మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ ఇంధన భారం తప్పట్లేదు. రోజువారీ ప్రయాణ ఖర్చులు గణనీయంగా పెరగనున్నాయి.

తాజా పెంపుతో ఢిల్లీలో కేజీ సీఎన్జీ రూ. 83.09 నుంచి రూ. 86.98 పైసలకు పెరిగింది. గుర్గావ్ లో రూ. 92.01, నొయిడాలో రూ. 111.87, ఘజియాబాద్ లో రూ. 95.59 కి చేరింది. తాజా ధరల పెంపుదలకు దారితీసిన కారణాలను వివరించింది ఐజీఎల్. అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు సరఫరా నిలిచిపోవడం వల్ల ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగినట్లు తెలిపింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే సరుకు రవాణాకు ఏర్పడిన ఆటంకాలు అంతర్జాతీయ గ్యాస్ మార్కెట్ను పూర్తిగా దెబ్బతీశాయని వివరించింది.
వీటికి తోడు యూరప్ లో శీతాకాలం సమీపిస్తుండటం, ఆయా దేశాల ప్రజలు వెచ్చదనం కోసం సహజ వాయువు నిల్వలను భారీగా కొనుగోలు చేస్తోండటం వల్ల ఒక్కసారిగా వీటికి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా వీటి రేట్లు అంతర్జాతీయంగా రెట్టింపు అయ్యాయని ఐజీఎల్ పేర్కొంది. దేశంలో కూడా సీఎన్జీ వాహనాల సంఖ్య కూడా పెరుగుతోందని, వాటి అవసరాలు అనుగుణంగా సహజవాయువును సరఫరా చేయాల్సి ఉందని తెలిపింది.
దిగుమతి వ్యయం విపరీతంగా పెరిగినప్పటికీ, దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని పూర్తిగా వేయకుండా రక్షణ కల్పించే ప్రయత్నం చేశామని ఐజీఎల్ పేర్కొంది. గతంలో హార్ముజ్ సంక్షోభం తారస్థాయికి చేరిన సమయంలోనూ ఢిల్లీలో సీఎన్జీ ధరలు చాలా వరకు స్థిరంగానే ఉన్నాయని సంస్థ స్పష్టం చేసింది. ఈ పెంపు ద్వారా ఇన్పుట్ ఖర్చులను పాక్షికంగా మాత్రమే పూడ్చుకుంటున్నామని, సీఎన్జీ సరఫరాలో ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.













Click it and Unblock the Notifications