EPFO: ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. పీఎఫ్ లిమిట్ పై కేంద్రం కీలక నిర్ణయం!
ప్రైవేట్ రంగ ఉద్యోగుల సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే 'ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ' (EPFO) వేతన పరిమితి పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నెలవారీ కనీస వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000 కు పెంచాలనే ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెట్టింది. దీనివల్ల కోట్లాది మంది ఉద్యోగులకు మరింత ఎక్కువ పీఎఫ్ పొందే అవకాశం ప్రస్తుతానికి చేజారినట్లయింది.
కంపెనీలపై భారం పడకుండానే..
కొత్త లేబర్ కోడ్ నిబంధనల అమలు వల్ల ఇప్పటికే కంపెనీలపై అదనపు ఖర్చుల భారం పెరిగిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి తరుణంలో పీఎఫ్ పరిమితిని కూడా పెంచితే వ్యాపార సంస్థలపై మరింత ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ఐటీ రంగంలోని సంస్థలు ఇప్పటికే కొత్త నిబంధనల కోసం వందల కోట్లు అదనంగా ఖర్చు చేశాయి. అందుకే, అన్ని వర్గాల (స్టేక్హోల్డర్స్) అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే దీనిపై ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అసలు ఈ రూ.15,000 పరిమితి కథేంటి?
గత 2014 సంవత్సరం నుంచి పీఎఫ్ లెక్కింపునకు బేసిక్ శాలరీ పరిమితి రూ.15,000 గానే కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం.. ఉద్యోగి జీతం నుంచి 12 శాతం, కంపెనీ నుంచి 12 శాతం చొప్పున పీఎఫ్ ఖాతాకు జమ కావాలి. రూ.15,000 పరిమితి ప్రకారం చూస్తే నెలకు గరిష్టంగా రూ.1,800 మాత్రమే తప్పనిసరిగా పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది.
ఒకవేళ ఈ పరిమితిని రూ.25,000 కు పెంచితే, అప్పుడు ఆ మొత్తాన్ని రూ.3,000 కు పెంచాల్సి వస్తుంది. ఈ అదనపు మొత్తాన్ని భరించడానికి కంపెనీలు సిద్ధంగా లేకపోవడమే ప్రస్తుత వాయిదాకు కారణం.
లక్షలాది మంది కార్మికుల డిమాండ్
మరోవైపు, మెట్రో నగరాల్లో సాధారణ కార్మికుల జీతాలు కూడా ఇప్పుడు రూ.15 వేలు దాటిపోతున్నాయి. దీనివల్ల వారు పీఎఫ్ పరిధిలోకి రాకుండా పోతున్నారని, ఈ పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి.
ఒకవేళ ఈ వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచితే, దేశంలో కొత్తగా మరో కోటి మందికి పైగా కార్మికులకు పీఎఫ్, పెన్షన్ వంటి సామాజిక భద్రత లభిస్తుందని కార్మిక శాఖ అంతర్గత అంచనా. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో సుమారు 8 కోట్ల మంది యాక్టివ్ సభ్యులు ఉండగా, దాదాపు రూ.27-28 లక్షల కోట్ల నిధుల నిల్వలు ఉన్నాయి.















Click it and Unblock the Notifications