భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు: కారణాలివే!
న్యూఢిల్లీ: బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్ లేమి కారణంగా బుధవారం ఐదున్నర నెలల కనిష్టానికి బంగారం ధరలు పడిపోయాయి.
మంగళవారం రూ.100 తగ్గిన బంగారం.. బుధవారం రూ.250 తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,800గా ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్ మందగించడంతో పసిడి ధరలు పడిపోయినట్లు బులియన్ ట్రేడర్లు వెల్లడించారు.
ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి రూ. 620 తగ్గడంతో.. రూ.39,200గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు మందగించడంతో వెండి ధర తగ్గింది.
కాగా, సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.32శాతం తగ్గడంతో 1,223.30 డాలర్లు పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం బంగారం ధర రూ.30,800గా ఉండగా, 99.5శాతం పసిడి రూ.30,650గా ఉంది.