నేపాల్ వెళ్లిన ఇన్ఫోసిస్ టాప్ ఎగ్జిక్యూటివ్ గోపిశెట్టి ఆచూకీ తెలియరావట్లేదు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టాప్ ఎగ్జిక్యూటివ్ లక్ష్ గోపిశెట్టి నేపాల్ వరదల్లో గల్లంతయ్యారు. ఆయన ఆచూకీ తెలియరావట్లేదు. వ్యక్తిగత పర్యటన కోసం ఆయన ఇటీవలే నేపాల్ వెళ్లారు. వరదల తర్వాత ఆయన ఆచూకీ తెలియరావట్లేదని ఇన్ఫోసిస్ అధికారికంగా తెలియజేసింది. ప్రస్తుతం ఆయనతో ఎలాంటి సంప్రదింపులు జరపడం సాధ్యం కావట్లేదని, ఆయన క్షేమంగా తిరిగి రావడానికి ప్రస్తుతం అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని పేర్కొంది.
ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తోన్నారు లక్ష్ గోపిశెట్టి. ఇది.. ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ. ఇది.. ప్రధానంగా అమెరికా, కెనడా వంటి దేశాల్లో ప్రభుత్వ రంగ సేవలకు సంబంధించిన ఐటీ వ్యూహాలను పర్యవేక్షిస్తుంది. లక్ష్ గోపిశెట్టి ఈ ఐటీ విభాగానికి ప్రెసిడెంట్, సీఈఓగా వ్యవహరిస్తోన్నారు. వేర్వేరు దేశాల ప్రభుత్వ సంస్థల శాఖలు, విభాగాల ఆధునికీకరణ, ఐటీ వ్యూహ నిపుణుడిగా పని చేస్తోన్నారు.

ఇన్ఫోసిస్లో ఈ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన అదే సంస్థలో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆ సమయంలో అమెరికా, యూరప్, ఆసియా మార్కెట్లలో క్లౌడ్, డిజిటల్ రంగాల సేవల విస్తరణకు అద్భుతమైన నాయకత్వం వహించారు. అంతకంటే ముందు యాక్సెంచర్ లో మేనేజింగ్ డైరెక్టర్గా పని చేశారు.ఐబీఎం, పీడబ్ల్యూసీ, హెచ్సీఎల్ వంటి టాప్ ఐటీ కంపెనీల్లో అత్యున్నత స్థాయి బాధ్యతలను నిర్వహించారు.
నేపాల్ వరదల్లో సంభవించిన అపార ప్రాణనష్టం, ఆస్తి నష్టం పట్ల ఇన్ఫోసిస్ యాజమాన్యం సంతాపాన్ని తెలియజేసింది. విదేశాంగ శాఖతో పాటు నేపాల్ రెస్క్యూ అధికారులు తీవ్ర వాతావరణంలోనూ సహాయక చర్యలను మరింత ముమ్మరం చేస్తోన్నారని పేర్కొంది. ఈ తీవ్ర విపత్తు నుండి లక్ష్ గోపిశెట్టితో పాటు అక్కడ చిక్కుకుపోయిన భారతీయులందరూ వీలైనంత త్వరగా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటోన్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. చైనా వైపు చిక్కుకున్న 153 మంది భారతీయ పౌరులను అధికారులు ఇప్పటికే సురక్షితంగా నేపాల్ సరిహద్దు దాటించారు. వీరిలో 21 మంది భారతీయులు ఖాట్మండు మీదుగా ఢిల్లీ చేరుకున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు నేపాల్ ప్రభుత్వానికి అవసరమైన పూర్తి స్థాయి సహాయాన్ని అందిస్తోన్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications