ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలుతున్న నోటు. చలామణిలో కింగ్!
మన దేశంలో నోట్ల రద్దు తరవాత రూ.2000 నోటు మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని హవానే నడిచింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం భారత నగదు వ్యవస్థను ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న ఏకైక నోటు.. మన రూ.500 మాత్రమే! మనం పర్సు తెరిచినా, మార్కెట్కు వెళ్లినా, ఏటీఎం నుంచి డబ్బులు తీసినా మన చేతికి ఎక్కువగా వచ్చేది ఐదొందల నోటే. అయితే ఈ నోటు భారత కరెన్సీ సామ్రాజ్యంలో ఎంతటి పెద్ద పీట వేసిందో తెలుసా? ఏకంగా 85 శాతానికి పైగా నోట్ల విలువ ఈ ఒక్క నోటుదే కావడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాలే ఈ విచిత్రమైన పరిస్థితిని కళ్ళకు కడుతున్నాయి.
ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం.. దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ దాదాపు రూ.42.44 లక్షల కోట్లు. ఇందులో ఒక్క రూ.500 నోట్ల విలువే రూ.36.29 లక్షల కోట్లుగా ఉంది. అంటే శాతాల్లో చెప్పాలంటే మొత్తం నోట్ల విలువలో 85.5 శాతం కేవలం ఐదొందల నోట్లతోనే నిండిపోయింది. మన దేశంలో తిరుగుతున్న మొత్తం నోట్లలో దాదాపు 41.3 శాతం నోట్లు రూ.500 కరెన్సీవే. సంఖ్య పరంగా చూస్తే సగానికంటే తక్కువగానే ఉన్నప్పటికీ, విలువ పరంగా చూస్తే మాత్రం 80 శాతానికి పైగా మార్కెట్ను ఈ ఒక్క నోటే ఏలేస్తోంది.

మిగతా నోట్ల పరిస్థితి ఏమిటి?
ఐదొందల నోటు అంత పెద్ద పీట వేస్తే, మరి మన పాత రూ.100, రూ.200 నోట్ల పరిస్థితి ఏమిటనే సందేహం రావచ్చు. రూ.500 తర్వాత ఆ స్థాయిలో రూ.100 నోటు రెండో స్థానంలో నిలిచింది. చలామణిలో ఉన్న రూ.100 నోట్ల మొత్తం విలువ రూ.2.80 లక్షల కోట్లుగా ఉంటే, రూ.200 నోట్ల విలువ రూ.2.13 లక్షల కోట్లుగా ఉంది. ఇక చిన్న కరెన్సీ నోట్లయిన రూ.50 నోట్లు రూ.55,161 కోట్లు, రూ.20 నోట్లు రూ.28,633 కోట్లు, రూ.10 నోట్లు రూ.28,215 కోట్ల మేర మార్కెట్లో ఉన్నాయి. చివరికి రూ.2, రూ.5 నోట్లన్నీ కలిపినా వాటి విలువ రూ.4,230 కోట్లకు మించకపోవడం విశేషం.
చరిత్రగా మారిన రెండు వేల నోటు
ఒకప్పుడు హడావుడి చేసిన రూ.2000 నోటు ఇప్పుడు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రభుత్వం ఈ నోట్లను వెనక్కి తీసుకోవడంతో ప్రస్తుతం మార్కెట్లో ఇవి కేవలం 0.12 శాతం మాత్రమే మిగిలాయి. రూ.2000 నోటు ఉపసంహరణ తర్వాతే ప్రజలంతా రూ.500 నోట్లపై తీవ్రంగా ఆధారపడటం మొదలుపెట్టారు. దానికితోడు యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ లావాదేవీలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, దేశంలో నగదు వినియోగం తగ్గకపోవడం మరొక ఆసక్తికరమైన అంశం. నిత్యం డిజిటల్ చెల్లింపులు చేస్తున్నప్పటికీ, మార్కెట్లో మాత్రం క్యాష్ కింగ్గా రూ.500 నోటే రాజ్యమేలుతోంది!














Click it and Unblock the Notifications