విలవిల్లాడుతున్న రూపాయి, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య రేగిన యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో పెరిగిన భయాందోళనలు, ముడిచమురు ధరల అకస్మాత్తు పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలపడటంతో సోమవారం భారత రూపాయి విలువ ఘోరంగా పతనమైంది. అమెరికన్ కరెన్సీతో పోలిస్తే రూపాయి ఏకంగా 56 పైసలు క్షీణించి 95.74 (తాత్కాలికం) వద్ద ముగిసింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో సాధించిన లాభాలన్నింటినీ రూపాయి ఒకేరోజులో కోల్పోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది.
విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (Forex Market) లో సోమవారం ఉదయం రూపాయి 95.35 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఒక దశలో 95.15 స్థాయికి చేరుకున్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడి తట్టుకోలేక చివరకు 56 పైసల నష్టంతో 95.74 వద్ద స్థిరపడింది. నిజానికి, విదేశీ మూలధన ప్రవాహాన్ని పెంచేందుకు ,ఫారెక్స్ లిక్విడిటీని బలోపేతం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న చర్యల వల్ల గత శుక్రవారం రూపాయి 56 పైసలు పుంజుకుని 95.18 వద్ద ముగిసింది. అయితే, ఆ సంతోషం 24 గంటలు కూడా నిలవకుండానే సోమవారం నాటి మార్కెట్ రూపాయిని దారుణంగా దెబ్బతీసింది.

క్రూడ్ ఆయిల్ షాక్.. ట్రంప్ రంగప్రవేశం!
ఇజ్రాయెల్పై ఇరాన్ వందలాది మిస్సైళ్లతో విరుచుకుపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 3.94 శాతం పెరిగి.. బ్యారెల్కు 96.76 డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ బలాన్ని కొలిచే 'డాలర్ ఇండెక్స్' కూడా 0.09 శాతం పెరిగి 100.16 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు, పశ్చిమాసియాలో పరిస్థితి మరింత విషమించకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇరాన్ చేసిన తాజా దాడిపై ప్రతీకారం తీర్చుకోవద్దని ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కోరినట్లు అంతర్జాతీయ మీడియా (ఆక్సియోస్) కథనాలు వెల్లడించాయి. ప్రతీకార చర్యలకు దిగితే గత మూడు నెలలుగా సాగుతున్న శాంతి చర్చలు దెబ్బతింటాయని ట్రంప్ హెచ్చరించారు.
మార్కెట్లను ముంచేసిన విదేశీ ఇన్వెస్టర్లు (FIIs)
యుద్ధ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 719.08 పాయింట్లు నష్టపోయి 73,524.26 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 243.70 పాయింట్లు కోల్పోయి 23,123 వద్ద ముగిసింది. గ్లోబల్ టెన్షన్స్ కారణంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) భారత మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. గడచిన శుక్రవారం ఒక్కరోజే విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 8,776.25 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించడం గమనార్హం.
ఊరటనిస్తున్న ఫారెక్స్ నిల్వలు.. ఆర్బీఐ పైనే భారం!
రూపాయి పతనానికి బ్రేకులు వేయడానికి ఆర్బీఐ రంగంలోకి దిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ డాలర్ - ఇండియన్ రూపాయి (USD-INR) స్పాట్ ధర రాబోయే రోజుల్లో 95.40 నుంచి 96.10 శ్రేణిలో ట్రేడ్ అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దేశానికి ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. మే 28తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు (Forex Reserves) 938 మిలియన్ డాలర్లు పెరిగి 682.321 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో ఈ నిల్వలు 7.511 బిలియన్ డాలర్లు తగ్గడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న పటిష్టమైన ఫారెక్స్ నిల్వల ఆధారంగా ఆర్బీఐ మార్కెట్లో జోక్యం చేసుకుని రూపాయి మరింత పతనం కాకుండా కాపాడగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications