సంక్షేమ పథకాలకు 'ఈ-రూపాయి', సబ్సిడీలపై ఆర్బీఐ సంచలన ఆర్డర్!
మనం వాడుతున్న నోట్లు, నాణేల స్థానంలో తీసుకొచ్చిన 'డిజిటల్ రూపాయి' (ఈ-రూపాయి) వాడకాన్ని మరింత విస్తృతం చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. సాధారణ ప్రజల్లో దీని వాడకం కొంత తగ్గినప్పటికీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీల పంపిణీతో పాటు విదేశీ లావాదేవీల్లో (సరిహద్దుల ఆవలి చెల్లింపులు) డిజిటల్ రూపాయిని పెద్ద ఎత్తున ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ తన తాజా వార్షిక నివేదిక (2025-26)లో కీలక ప్రణాళికలను వెల్లడించింది.
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా, నేరుగా లబ్ధిదారులకే చేరేలా చూసేందుకు డిజిటల్ రూపాయి టెక్నాలజీ (CBDC) అద్భుతంగా పనిచేస్తోందని ఆర్బీఐ పేర్కొంది. ఇప్పటికే గుజరాత్, పుదుచ్చేరి, చండీగఢ్లలో ఆహార సబ్సిడీల పంపిణీ కోసం నిర్వహించిన పైలట్ ప్రాజెక్టులు సూపర్ సక్సెస్ అయ్యాయి. అనేక ప్రభుత్వ సంస్థలు ఈ టెక్నాలజీని ఉపయోగించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాల్లో ప్రయోగాలు ప్రారంభించాయి. దీనివల్ల ప్రభుత్వం ఏ పని కోసం అయితే డబ్బులు ఇస్తుందో, లబ్ధిదారులు వాటిని ఆ పని కోసమే వాడేలా (ప్రోగ్రామబిలిటీ ఫీచర్) నియంత్రించే అవకాశం ఉంటుంది.

రిటైల్ మార్కెట్లో తగ్గిన క్రేజ్..
ఒకవైపు ఆర్బీఐ డిజిటల్ రూపాయిని విస్తరిస్తున్నప్పటికీ, రిటైల్ మార్కెట్లో సాధారణ ప్రజల వాడకం మాత్రం గతంతో పోలిస్తే తగ్గడం గమనార్హం. గత ఏడాది మార్చి నాటికి రూ.10.16 బిలియన్లుగా ఉన్న ఈ-రూపాయి చలామణి.. ఈ ఏడాది మార్చి 31, 2026 నాటికి రూ.7.71 బిలియన్లకు పడిపోయింది. దేశంలో ప్రస్తుతం కనీసం 10 రకాల డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నప్పటికీ, సాధారణ లావాదేవీల్లో దీని జోరు కాస్త తగ్గింది. అయినా సరే, లాంగ్ రన్లో డిజిటల్ కరెన్సీకి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఆర్బీఐ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఇక అంతర్జాతీయంగా ఈ-రూపాయి హవా!
భారతీయులు విదేశాలకు సులభంగా, తక్కువ ఖర్చుతో డబ్బులు పంపుకునేలా ఆర్బీఐ అంతర్జాతీయ ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా సింగపూర్ ద్రవ్య అథారిటీతో డిజిటల్ ఆస్తుల ఒప్పందంపై సంతకాలు చేసింది. అటు సింగపూర్, ఇటు యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) దేశాలతో డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులపై చర్చలు నడుస్తున్నాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవహారాలను చూసే 'బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్' (BIS) నేతృత్వంలోని బహుపాక్షిక కార్యక్రమాల్లో కూడా ఆర్బీఐ చురుగ్గా పాల్గొంటోంది.
దేశీయ బ్యాంకుల కోసం ప్రత్యేక 'క్లౌడ్ సేవల' విప్లవం
సాంకేతిక పరిజ్ఞానంలో గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులకు గట్టి పోటీ ఇస్తూ ఆర్బీఐ మరో సంచలన అడుగు వేసింది. మన దేశంలోని ఆర్థిక సంస్థల (బ్యాంకుల) డేటా భద్రత కోసం సొంతంగా 'ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టార్ (IFS) క్లౌడ్ ప్లాట్ఫామ్'ను తీసుకువచ్చింది. ప్రపంచంలోని ఏ సెంట్రల్ బ్యాంక్ కూడా ఇప్పటివరకు ఇలాంటి చొరవ తీసుకోలేదు. ప్రస్తుతం తొమ్మిది మంది వినియోగదారులతో ఇది 'బీటా మోడ్' (టెస్టింగ్ స్టేజ్)లో రన్ అవుతోంది. మొదటి దశలో ప్రాథమిక సేవలు, రెండో దశలో మరిన్ని అధునాతన సేవలతో ఈ క్లౌడ్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications