400 ఏళ్ల క్రూరత్వానికి చరమగీతం. అది డాన్స్ కాదు.. నరకయాతన!
మన చిన్నతనంలో వీధుల్లోకి ఎలుగుబంటిని తీసుకువచ్చి, డప్పులు వాయిస్తుంటే అది కాళ్లు గాలిలోకి లేపి ఊగుతుంటే చూసి సంబరపడని వారుండరు. కానీ, ఆ అమాయక ప్రాణి చేసినది నాట్యం కాదు.. తట్టుకోలేని నరకయాతనతో పెట్టిన కేకలని మనలో ఎంతమందికి తెలుసు? మొఘలుల కాలం నుంచి అంటే దాదాపు 400 ఏళ్లుగా 'కలందర్' అనే సంచార తెగవారు ఈ ఎలుగుబంట్లను ఆడించడాన్నే తమ ప్రధాన జీవనోపాధిగా మలుచుకున్నారు. అయితే ఆ వినోదం వెనుక ఎంతటి ఘోరమైన క్రూరత్వం దాగుందో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది.
ముక్కుకు సూది గుచ్చి.. గుండెను పిండేసిన బాధ!
ఈ ఆట కోసం కలందర్లు అడవుల్లోకి వెళ్లి తల్లి ఎలుగుబంటిని దారుణంగా చంపేసేవారు. తల్లిని కోల్పోయిన పసి ఎలుగుబంటి పిల్లలను తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేవారు. ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండానే.. ఎలుగుబంటి ముక్కు భాగాన్ని దళసరి సూదితో గట్టిగా పొడిచి, దానికి గొలుసు లేదా తాడు కట్టేవారు. ఎద్దులకు ముక్కుతాడు వేసినట్లుగా ఆ తాడును గట్టిగా పైకి గుంజినప్పుడల్లా.. ఆ దారుణమైన నొప్పిని తట్టుకోలేక ఎలుగుబంటి గాలిలోకి ఎగిరేది. లోపల ప్రాణం పోయేంత నొప్పి ఉంటే, బయట జనం మాత్రం అది డాన్స్ చేస్తోందని భావించి చప్పట్లు కొట్టేసేవారు. పంటి గాయాలు చేయకుండా ఉండటానికి వాటి కోరపళ్లను సుత్తితో విరగ్గొట్టేవారు.

అడవి ప్రాణుల కోసం కదిలిన ఇద్దరు మనుషులు!
తరతరాలుగా సాగుతున్న ఈ దారుణాన్ని గమనించిన కార్తీక్ సత్యనారాయణ్, శేషమ్మ అనే ఇద్దరు వ్యక్తులు చలించిపోయారు. ఈ క్రూరత్వానికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని నిశ్చయించుకుని 1995లో 'వైల్డ్ లైఫ్ SOS' (Wildlife SOS) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. వాస్తవానికి మన దేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972, 1998లో వచ్చిన చట్ట సవరణల ద్వారా ఎలుగుబంట్లను బంధించడం, ప్రదర్శించడం చట్టవిరుద్ధం చేశారు.
కానీ ఈ చట్టాలు వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో ఎలుగుబంట్ల డాన్స్ పేరుతో సర్కస్లు జరిగేవి. ఇది గమనించిన ఈ ఇద్దరు ఎలుగుబంట్ల రక్షణ అనేది కేవలం చట్టాలు చూపి భయపెడితే అయ్యే పని కాదని బలంగా నమ్మారు. ఎందుకంటే కలందర్ తెగకు అది తప్ప వేరే జీవనోపాధి తెలియదు. అందుకే ఆ ఇద్దరూ నేరుగా కలందర్ తండాల్లోకి వెళ్లారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాల గురించి వివరిస్తూనే, వారికి ప్రత్యామ్నాయ దారి చూపించారు.
తుపాకులు పట్టలేదు.. దారి చూపించారు!
కలందర్ కుటుంబాలకు ఉపాధి కోసం కుట్టు మిషన్లు, ఇతర చేతివృత్తుల సామగ్రిని అందజేశారు. వారి పిల్లలు వీధుల్లో తిరగకుండా దాదాపు 1700 మందికి పైగా పిల్లలను బడుల్లో చేర్పించి ఉచితంగా చదువు చెప్పించారు. తమ భవిష్యత్తుకు ధోకా లేదని నమ్మకం కుదిరాక, ఆ తెగ ప్రజలే స్వచ్ఛందంగా దాదాపు 628కి పైగా ఎలుగుబంట్లను 'వైల్డ్ లైఫ్ SOS' సంస్థకు అప్పగించారు.
అలా 400 ఏళ్లుగా సాగుతున్న ఒక నరకప్రాయమైన సంస్కృతికి వీరిద్దరూ ముగింపు పలికారు. రక్షించబడిన ఆ ఎలుగుబంట్లు ఇప్పుడు ప్రత్యేక పునరావాస కేంద్రాల్లో స్వేచ్ఛగా బతుకుతున్నాయి. సాయం చేయాలనే మంచి మనసు, సమస్య మూలాల్లోకి వెళ్లే ఆలోచన ఉంటే వందల ఏళ్ల అన్యాయాన్ని కూడా అంతం చేయవచ్చని నిరూపించిన ఈ రియల్ హీరోల కథ నిజంగానే స్ఫూర్తిదాయకం!














Click it and Unblock the Notifications