IIT JAM 2027: ఐఐటీల్లో పీజీ కోర్సుల పరీక్ష- వెబ్ సైట్ ప్రారంభం-దరఖాస్తులు ఇలా..!
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో పీజీ కోర్సులు చేయాలనుకునే విద్యార్ధుల కోసం వచ్చే ఏడాది నిర్వహించే ఐఐటీ జామ్ 2027 (IIT JAM 2027) కోసం ఐఐటీ ఖరగ్ పూర్ అధికారిక వెబ్ సైట్ ప్రారంభించింది. ఐఐటీలతో పాటు ఇతర అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో మాస్టర్స్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్ 2027)కు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. ఈసారి జామ్ పరీక్ష నిర్వహించే బాధ్యతలు ఐఐటీ ఖరగ్పూర్ కు అప్పగించారు.
ఐఐటీ ఖరగ్పూర్ వచ్చే ఏడాది జామ్ పరీక్ష రాసే అభ్యర్ధుల కోసం అధికారిక వెబ్ సైట్ 'jam.iitkgp.ac.in' ను ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచార పత్రం (ఇన్ఫర్మేషన్ బ్రోచర్) 2026 ఆగస్టు 22న విడుదల చేస్తారు. అర్హత కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 5 నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 12. డేటా కరెక్షన్స్ కోసం నవంబర్ 10 వరకూ అవకాశం ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా మాస్టర్ ఆఫ్ సైన్స్ (M.Sc), ఐఐటీలలో పీహెచ్డీతో కూడిన జాయింట్ ఎంఎస్సీ లాంటి కోర్సులలో ప్రవేశాలు లభిస్తాయి.

జామ్ పరీక్షకు దరఖాస్తులన్నీ ఆన్ లైన్ ద్వారానే స్వీకరిస్తారు. అభ్యర్ధులు తమ వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలను నమోదు చేసి, దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏడు సబ్జెక్టులలో ఉంటుంది. అందులో బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమ్యాటికల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఉన్నాయి. పరీక్ష ఖచ్చితమైన తేదీ , పరీక్షా సరళి వివరాలు ఆగస్టు 22న విడుదలయ్యే ప్రోస్పెక్టస్లో అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించి మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే ఫాలో కావాలని అధికారులు కోరుతున్నారు.














Click it and Unblock the Notifications